కొంతమంది ఉన్నతపదవుల్లో ఉంటారు కానీ వాళ్లు మాట్లాడే మాటలు మాత్రం వివాదాస్పదమవుతుంటాయి. తెలిసి మాట్లాడతారో.. తెలియక మాట్లాడతారో తెలీదు. కొంతమంది తెలియక నోరు జారితే.. మరికొందరేమో పనిగట్టుకుని వివాదాస్పదం చేస్తుంటారు. అలాంటికోవకే వచ్చారు డీఎంకే నేత కనిమొళి.
కోట్లాది మంది ఆరాధ్య దైవంపై భావించే తిరుమల వెంకటేశ్వరుడిపై డీఎంకే ఎంపీ కనిమొళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భక్తులను, హుండీని కాపాడుకోలేని దేవుడు భక్తులను ఎలా కాపాడుకుంటాడని ప్రశ్నించారు. ఆయనకు శక్తులున్నట్లయితే ఆయనకు భద్రత ఎందుకని ఎద్దేవా చేశారు. తిరుమల మొత్తం డబ్బుమయమైపోయిందన్నారు. అక్కడ డబ్బులిస్తేనే ఎక్కువసేపు దర్శనం లభిస్తుందన్నారు. లేకుంటే తోసేస్తారన్నారు.
తిరుమలకు నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వారిలో 70 వేల మంది స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. భక్తుల తాకిడి పెరగడంతో టీటీడీ ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. వెంకన్నకు వచ్చే ముడుపులను కాపాడి ఇతరత్రా కార్యకలాపాలకు టీటీడీ ఖర్చు చేస్తోంది. దీంతో హుండీల వద్ద భద్రత ఏర్పాటు చేస్తోంది. దీన్ని కూడా కనిమొళి ఎద్దేవా చేయడం వివాదాస్పదమవుతోంది.
కేవలం తిరుమలలో మాత్రమే కాదు.. ప్రతి ఆలయం వద్దా భద్రత ఇప్పుడు మామూలైపోయింది. అంతమాత్రాన దేవుడికి భద్రత ఎందుకు అని ప్రశ్నించడం విడ్డూరమే. పనిగట్టుకుని విమర్శంచడమే అవుతుంది. ఆమెకు భక్తి ఉండకపోవచ్చు.. దేవుడిపై నమ్మకం లేకపోవచ్చు. అంతమాత్రాన కోట్లాదిమంది ఆరాధ్యాడిగా పిలుచుకునే శ్రీనివాసుడిని విమర్శించడం .. భక్తులను కూడా అవమానించడమే.!
డీఎంకే నాస్తిక పార్టీ. ఆ పార్టీనేతలు భక్తిని ఎంకరేజ్ చేయరు. ఆ పార్టీ అధినేత కరుణానిధి పలుమార్లు హిందూమతంపైన, హిందూ దేవుళ్లపైన వ్యాఖ్యలు చేశారు. రాముణ్ణి తాగుబోతంటూ కరుణానిధి గతంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తాజాగా ఆయన కుమార్తె కనిమొళి వెంకన్నపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కనిమొళిపై హిందూమక్కల్ కట్చి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కనిమొళి మాత్రం క్షమాపణ చెప్పలేదు.