ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ను లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. తనను గజల్ శ్రీనివాస్ లైంగికంగా వేధించారని, ఓ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిసెంబరు 29 న పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు, దీనికి సంబంధించిన ఆధారాలను సైతం పోలీసులకు అందజేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాధితురాలు ఆలయవాణి రేడియోలో జాకీగా పని చేస్తున్నారు.
శ్రీనివాస్ కొంతకాలంగా వేధిస్తున్నారని.. ఇటీవల అవి ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో సమగ్ర విచారణ చేపట్టిన తర్వాత గజల్ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి చెంచల్ గూడ జైలుకు పంపారు. అయితే గజల్ శ్రీనివాస్ బెయిల్ కోసం మంజూరు చేయగా..కోర్టు తిప్పికొట్టింది. ఆయన బయటకు వస్తే..కేసు తారుమారయ్యే అవకాశం ఉందని చెప్పింది.
అంతే కాదు గతంలో ఆయనతో కలిసి పనిచేసిన వివిధ సాంస్కృతిక సంస్థలు గజల్ను చీకొడుతున్నాయి. ఆయన నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో విస్తుపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సర్కారు సైతం షాకిచ్చింది. గజల్ శ్రీనివాస్ను స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
ప్రస్తుతం గజల్ శ్రీనివాస్ జైల్లో కూడా గజల్స్తోనే స్వాంతన పొందుతున్నారు. జైలుకు వచ్చిన తొలి రెండు రోజుల్లో భోజనం చేయలేదట. తరువాతి రోజు నుంచి జైలు భోజనాన్ని తీసుకుంటున్నారట. జైల్లో తోటి ఖైదీలతో ఆయన కలివిడిగా ఉంటున్నారట. అంతే కాదు జైల్లోని ఖైదీలకు కూడా గజల్స్ వినిపిస్తున్నారు. శనివారం జైల్లో జరిగిన యోగా శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో గజల్స్ పాడి అక్కడి వారందిరిని ఆకట్టుకున్నారు.