రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పరిస్థితి మూడు వివాదాలు, ఆరు ఆరోపణలు అన్న చందంగా మారింది పరిస్థితి! అటు తెలంగాణ, ఇటు ఏపీల నుంచి తీవ్ర అసమ్మతి పొగలు సెగలు ఆయనను చుట్టుముట్టాయి. 2009 డిసెంబరులో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణాలకు కూడా నరసింహనే గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక.. అప్పటి విభజన సెగల నేపథ్యంలో తెలంగాణ వాదులకు వ్యతిరేకంగా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారని అప్పటి ఉద్యమ పార్టీ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఇక, ఇప్పుడు అదే నరసింహన్పై గత కొన్నాళ్లుగా తెలంగాణలోని విపక్ష కాంగ్రెస్ ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది.
అధికార టీఆర్ ఎస్కు తోపులా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్కు రైట్ హ్యాండ్గా మారిపోయారని, అధికార పార్టీపై మమకారం చూపిస్తున్నారని విమర్శల వరద పారిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. విపక్ష నేతలకు గవర్నర్ వద్ద కనీస మర్యాద కూడా లభించడం లేదని వాపోతున్నారు. విపక్షం ఉన్నది అధికార పక్షం చేసే లోపాలను ఎత్తి చూపేందుకేనని, తమ పనితాము చేస్తున్నా.. కూడా.. గవర్నర్ ఓర్చుకోలేక పోతున్నారని, సీఎంను, మంత్రి కేటీఆర్ను ఏమీ అనకూడదని ఆదేశాలు ఇచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. ఏదేమైనా.. గవర్నర్ వ్యవహార శైలి తీవ్ర ఆక్షేపణీయంగా ఉందనేది టీ కాంగ్రెస్ నేతల మాట.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. సాక్షాత్తూ.. ఇక్కడి ప్రభుత్వంలోని మిత్రపక్షం బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజే గవర్నర్పై పదునైన విమర్శలతో రెచ్చిపోతున్నారు. ఏపీ అభివృద్ధికి గవర్నర్ అడ్డుపడుతున్నారని విమర్శించారు. తీవ్ర ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారని, ఈ క్రమంలో భూముల విషయంలో పెట్టుబడి దారులకు కొన్ని మినహయింపులు ఇచ్చి ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం నాలా పన్నును తగ్గిస్తూ.. తీసుకువచ్చిన బిల్లుకు గవర్నర్ ఉద్దేశ పూర్వకంగానే మోకాలడ్డుతున్నారని తీవ్ర ఆరోపణ చేశారు.
ఏపీలో నాలా పన్ను తగ్గిస్తే.. తెలంగాణలోని పరిశ్రమలు కూడా ఏపీకి వచ్చే అవకాశం ఉన్నందున తెలంగాణపై పక్ష పాతం చూపిస్తూ.. గవర్నర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అంతేకాదు, ఏపీకి ప్రత్యేకంగా గవర్నర్ కావాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే కేంద్రానికి సైతం తాము ఫిర్యాదు చేసేందుకు సిద్ధమేనని చెప్పారు. కొత్త గవర్నర్ నియామకం వెంటనే జరిగితే ఏపీకి కొంత మేలు జరుగుతుందని, బడ్జెట్ సమావేశాల్లోగా గవర్నర్ నియామకం కావాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఇక, ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలోనూ గవర్నర్గా ఆయన ఒక్క మాట చెప్పలేకపోయారనే వాదన కూడా ఉంది. మొత్తంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితిని చూస్తుంటే.. గవర్నర్ కు ఈ పరిణామం తీవ్ర ఇబ్బంది కరంగా మారే పరిస్థితి కనిపిస్తోందనిఅంటున్నారు పరిశీలకులు మరి ఏం జరుగుతుందో చూడాలి.