తెలంగాణలో కొంత కాలంగా రాజకీయ రగడ మొదలైంది. ఇప్పటికే టీటీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి..ఏ చిన్న చాన్స్ దోరికినా అధికార పక్షాన్ని ఎండగడుతున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయనకు అధికార పార్టీ సభ్యులు కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే..ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… గురువారం రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడిన మాటలు 100 శాతం వాస్తవమన్నారు.
నాడు కేసీఆర్ను తిట్టినవారే నేడు ఆయన కేబినెట్లో కొనసాగుతున్నారని రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఉద్యమంతో ఏమాత్రం సంబంధంలేనివాళ్లు తెలంగాణ కేబినెట్లో ఉన్నారని పేర్కొన్నారు. ఆ విషయం తలుచుకుంటే కళ్లవెంట నీళ్లు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో ఎవరు ఎన్ని త్యాగాలు చేశారో ప్రజలు చూశారని..ఆ సమయంలో ఉద్యమాన్ని అపహాస్యం చేసిన వారు కూడా కెబినెట్ లో కొనసాగుతున్నారు.
కానీ, సిఎం కెసిఆర్ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉంటుందన్నారు. నాడు తెలంగాణ కోసం పనిచేయని వాళ్లు నేడు మాటలు చెబుతున్నారని చెప్పుకొచ్చారు. ఉద్యోగులు లేనిదే సకలజనుల సమ్మె లేదని శ్రీనివాస్ వాపోయారు. ఇలా నిన్న నాయిని సంచలన వ్యాఖ్యలు చేయగా, ఇవాళ శ్రీనివాస్ గౌడ్ మరోసారి ఆ వ్యాఖ్యలను సమర్థించడం గమనార్హం.