ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఇప్పటి వరకు వైసీపీ అధినేత జగన్ మొగుడనుకుంటే ఇప్పుడు కొత్తగా మిత్ర పక్షం బీజేపీ మాతృసంస్థ ఆర్ ఎస్ ఎస్ మరో మొగుడుగా తయారైన వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో మిత్ర పక్షమే అయినప్పటికీ.. ఆ విధంగా కాకుండా విపక్షం మాదిరిగా వ్యవహరించాలని నిర్ణయించడమే తాజా పరిణామాలను వేడెక్కిస్తున్నాయి. హిందుత్వ భావజాలంతో నిండిపోయిన ఆర్ ఎస్ ఎస్ ఇప్పటి వరకు చంద్రబాబు సర్కారు నిర్ణయాల్లో వేలు పెట్టలేదు. అయితే, తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి బోర్డు చైర్మన్ విషయంలో మాత్రం .. కాలు.. వేలు. ఇలా అన్నీ పెట్టేయడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తోంది.
టీటీడీ చైర్మన్గా కడప జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ పుట్టా సుధాకర్ యాదవ్ను దేవస్థానం పాలక మండలి చైర్మన్గా నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి వేరే వారికి అవకాశం ఇవ్వాలని భావించారు. అయితే, ఈయన చుట్టూ క్రిస్టియన్ వివాదం చుట్టుకుంది. దీంతో రాష్ట్రంలో విపక్షం కన్నా ముందే మిత్ర పక్షం బీజేపీ మాతృసంస్థ ఆర్ ఎస్ ఎస్ రంగంలోకి దిగిపోయింది.. సుధాకర్ యాదవ్కు క్రైస్తవ సంఘాలతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని, అటువంటి వ్యక్తిని ఇంత ముఖ్యమైన దేవాలయ చైర్మన్గా నియమించడం సరికాదని ఆర్ ఎస్ ఎస్ నాయకత్వం వాదిస్తోంది.
ఈ క్రమంలో అసలు ఏం జరిగిందంటే.. మైదుకూరు నియోజకవర్గంలో జరిగిన క్రైస్తవ సువార్త కూటమి కార్యక్రమాలకు పుట్టాకు ఆహ్వానం పలుకుతూ పెట్టిన ప్రత్యేక ఫ్లెక్సీల్లో ఆయన ఫొటో కూడా ఉంది. వారి కార్యక్రమానికి ఆయన ఆర్థిక సాయం చేయడంతో నిర్వాహకులు సుధాకర్ ఫొటో పెట్టారని ప్రచారం జరిగింది. దీనిపైనే ఆర్ఎస్ఎస్ అభ్యంతరం లేవనెత్తింది. ‘సుధాకర్ యాదవ్ కు క్రైస్తవులతో సంబంధాలు ఉన్నాయి. టీటీడీలో నలభై మంది వరకూ అన్య మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారని ఆలయ ఈవో స్వయంగా చెప్పారు. సుధాకర్ యాదవ్ వంటివారు చైర్మన్ అయితే అన్య మతస్థులైన టీటీడీ ఉద్యోగుల పట్ల ఉపేక్షా భావంతో వ్యవహరించే అవకాశం ఉంది. దీనివల్ల ఆలయ పవిత్రత దెబ్బ తింటుంది’ అని ఆర్ ఎస్ ఎస్ ఇప్పుడు ఆందోళనకు రెడీ అవుతున్నారు.
ఆర్ఎస్ఎస్కు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న భరత్ రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ తరఫున మంత్రులుగా ఉన్న మాణిక్యాలరావు, కామినేని శ్రీనివా్సలకు ఫోన్ చేసి సుధాకర్ నియామకంపై సంఘ్ తీసుకొన్న నిర్ణయాన్ని చెప్పారు. తమ అభ్యంతరాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని, నిర్ణయం మార్చుకొనేలా చూడాలని వారిని కోరారు. అయినా ప్రభుత్వం ముందుకు వెళ్తే ఆర్ఎ్సఎస్ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కూడా అంతర్గతంగా నిర్ణయం తీసుకొన్నారు. ఈ పరిణామం మొత్తంగా టీడీపీ ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబుకు కంటిపై కునుకు లేకుండా చేస్తుందనడంలో సందేహం లేదనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.