గ్రేటర్ నోయిడాలో జితేంద్ర మాన్ అనే బాక్సర్ హత్యకు గురయ్యాడు. జితేంద్ర మాన్ అనుమాస్పద స్థితిలో గ్రేటర్నోయిడాలోని తన అపార్టమెంట్లో మృతి చెందాడు. బుల్లెట్ గాయాలతో అతను మరణించినట్టు పోలీసులు గుర్తించారు. 27 ఏళ్ల జితేంద్ర.. హర్యానా స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాడు. గ్రేటర్ నోయిడాలో అతను జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 10వ తేదీ ఉదయం జిమ్కు మాన్ వెళ్లాడని, అప్పట్నించి అతని ఫోన్ స్విచ్ఛాప్లో ఉందని పోలీసులు తెలిపారు.
అపార్ట్మెంట్ తాళం కలిగి ఉన్న టొకాస్ అనే వ్యక్తి మాన్కు ఫోన్ చేసినప్పటికీ అతని నుంచి స్పందన లేకపోవడంతో అతని గదికి వెళ్లి చేశాడని, తలుపులు తెరిచి చూడగా మాన్ బుల్లెట్ గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించిందని, దాంతో అతను వెంటనే తమకు సమచారం ఇచ్చాడని పోలీసులు తెలిపారు. నిందితులెవరన్న విషయాన్ని పోలీసులు తేల్చలేకపోయారు.
పోస్టుమార్టమ్ రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. మొబైల్ కాల్ డిటేల్స్ను కూడా పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. రక్తపుమడుగులో పడి ఉన్న జితేంద్ర శరీరంపై రెండు బుల్లెట్లు దిగి ఉన్నాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం దుండగులు మాన్ను కాల్చి చంపి, మొబైల్ ఫోన్, ఇంటి తాళాలు తీసుకువెళ్తూ డోర్ లాక్ చేశారని ఆయన చెప్పారు.
జితేంద్ర మాన్ మాన్ 2008లో హర్యానా స్టేట్ బాక్సర్గా తన పేరు నమోదు చేసుకున్నాడని, ఢిల్లీలోనే కాకుండా ఫ్రాన్స్, ఉజ్బెకిస్థాన్, క్యూబా, రష్యాలోనూ పలు బాక్సింగ్ ఈవెంట్లలో పాల్గొన్నాడని ఎస్పీ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆగంతకులను గుర్తించి అరెస్టు చేస్తామని ఎస్పీ సింగ్ పేర్కొన్నారు.