భోగి పండుగ వేళ శ్రీకాకుళం పోలీసులు ఓ సంచలన విషయం బయటపెట్టారు. ఆంధ్రా మంత్రి అచ్చెన్నాయుడినే బెదిరించిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. మీడియా ముందు ప్రవేశపెట్టారు. డబ్బు సంపాదన కోసం వారు చేసిన రిస్క్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వాళ్లు ఏకంగా సొమ్ముకోసం మంత్రినే బెదిరించే ప్రయత్నం చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇందులో ఒకరు జ్యోతిష్యుడు కావడం మరో విశేషం.. అసలేంజరిగిందంటే..
మురపాక కాళిదాసుశర్మ విజయనగరం జిల్లా పార్వతీపురంలో జ్యోతిష్యుడిగా, యాజిగా పేరు సంపాదించాడు. జిల్లాలోని ప్రముఖులకు పూజలు, శాంతియోగాలు చేస్తుంటాడు. నాయకులకు ఉన్న జ్యోతిష్యం నమ్మకాన్ని ఆధారం చేసుకుని భారీగా డబ్బు గుంజేవాడు. నవంబర్ 11న పార్వతీపురంలో కాళిదాసుశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సౌభాగ్య విద్యేశ్వరి పంచాయతన యాగంలో అచ్చెన్నాయుడు సతీ సమేతంగా పాల్గొన్నారు. అచ్చెన్న రూ.80 లక్షలపైనే చెల్లించి ఇదే జ్యోతిష్యుడితో పూజలు చేయించుకున్నారని చెబుతున్నారు.
అచ్చెన్న నుంచి మరింత సొమ్ము రాబట్టేందుకు ఆయనకు ప్రాణహాని ఉందని నమ్మించేందుకు కాళిదాసు శర్మ ప్రయత్నించాడు. ఒడిసా రాయగడలో నివాసముంటున్న జోస్యుల శంకరరావు సాయంతో జిలిటెన్ స్టిక్స్ తెప్పించి మంత్రి ప్రయాణిస్తున్న దారిలో పెట్టించాడు. ఆ తర్వాత విలేకరులకు ఫోన్ చేసి మంత్రి తిరిగే దారిలో బాంబు పెట్టినట్లు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సోదాలు జరిపిన టెక్కలి నుంచి నరసన్నపేట వెళ్లే పెద్దబమ్మడి కూడలిలో జిలెటిన్ స్టిక్స్ గుర్తించారు.
ఆ తర్వాత మంత్రినే చంపేస్తామని బెదిరించి భారీగా డబ్బు గుంజాలని సదరు జ్యోతిష్యుడు ప్లాన్ వేసుకున్నారు. కానీ ఇంతలో బెదిరింపు కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఈ జ్యోతిష్యుడు గుట్టు రట్టు చేశారు. ఫోన్ కాల్స్ చేసిన నిందితులను వెంటాడి చివరికి వారి ఆట కట్టించారు. డబ్బు కోసం ఏకంగా మంత్రినే బెదిరించే స్థాయికి చేరుకున్న సదరు జ్యోతిష్యుడు, అతనికి సహకరించిన అనుచరుడు ఇద్దరూ ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు.