నగరి నియోజకవర్గానికి ప్రాతినధ్యం వహిస్తోన్న రోజా వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె ఏం మాట్లాడినా సంచలనమే.! ఇంకోరకంగా చెప్పాలంటే సంచలన విషయాలనే ఆమె మాట్లాడతారని కూడా అనుకోవచ్చు. తాజాగా సంక్రాంతి సంబరాలను ఆమె సొంత జిల్లా చిత్తూరులో జగన్ తో కలిసి జరుపుకున్నారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంతూరైన చంద్రగిరిలోనే జగన్ కూడా యాత్ర చేస్తున్నారు. ఓవైపు చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటే.. మరోవైపు జగన్ కూడా నారావారిపల్లెకు సమీపంలోనే రామచంద్రాపురం మండలం పారకాల్వ క్రాస్ వద్ద సంక్రాంతి పండగ చేసుకున్నారు. అక్కడే రోజా కూడా సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేశారు.
సంక్రాంతి సందర్భంగా జగన్ పాదయాత్రకు సెలవిచ్చారు. పూర్తిగా పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి పండగ వేడుకల్లో పాల్గొన్నారు. పంచె, కండువా ధరించి అచ్చ తెలుగు సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. జిల్లాకు చెందిన పలువురు నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాదయాత్రకు విరామం కావడంతో కుటుంబసభ్యులు కూడా అక్కడికే వచ్చేశారు. సమీపంలోని వై.ఎస్. విగ్రహానికి వారంతా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
పంచె, కండువాలో కనిపించిన జగన్ ను చూసి వైసీపీ నేతలు మురిసిపోయారు. ముఖ్యంగా రోజా అయితే ఉబ్బితబ్బిబ్బయ్యారు. జగన్ ను ఆ వేషంలో చూసి అచ్చం వై.ఎస్. రాజశేఖర రెడ్డే దిగివచ్చారా.. అన్నంత ఫీలయ్యారట.! జగన్ ను అలా చూసినప్పుడు సాక్షాత్తూ వై.ఎస్. రాజశేఖర రెడ్డినే చూస్తున్న ఫీలింగ్ కలిగిందని రోజా చెప్పుకొచ్చారు. చిత్తూరు జిల్లాలో జగన్ తో కలిసి పండగ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందని ఆమె చెప్పారు.