వీహెచ్ పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎన్ కౌంటర్ చేయాలని చూస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం తనను వేధిస్తోందని మీడియా సమావేశంలో వెల్లడించారు. సోమవారం నుండి అదృశ్యమైన తొగాడియా మంగళవారం ఓ పార్కులో అపస్మారకస్థితిలో కనిపించారు. రాజస్థాన్ పోలీసులు తనను ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఆరోపించారు.
ఈ విషయమై తనకు సమాచారం ఉన్నందునే పోలీసుల నుండి తప్పించుకొన్నానని ఆయన చెప్పారు. మంగళవారం నాడు ప్రవీణ్తొగాడియా మీడియాతో మాట్లాడారు. హిందూత్వ ఐక్యత గురించి పదేపదే మాట్లాడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం తనను చంపాలని చూస్తోందంటూ ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోంది. గుజరాత్, రాజస్థాన్ పోలీసులు నన్ను నిరంతరం వెంటాడుతున్నారు.
నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రాజస్థాన్ పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికే ఇక్కడకు వచ్చారు. వారు నన్ను ఎన్కౌంటర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
పదేళ్ల నాటి కేసులో తనను వేధింపులకు గురిచేస్తున్నారని తొగాడియా ఆరోపణలు చేశారు. ఈ కారణంగానే తాను మొబైల్ స్విచ్చాఫ్ చేసినట్టు ప్రవీణ్ తొగాడియా ప్రకటించారు. నా ఆరోగ్యం కుదుటపడగానే గుజరాత్ పోలీసులకు లొంగిపోతాను అని తొగాడియా వెల్లడించారు.