ఏపీకి సంబంధించిన విభజన హామీల సాధన కోసం ఇటీవల చంద్రబాబు ప్రధానమంత్రి మోడీని కలిసిన సంగతి తెలిసిందే. మోడీ నుంచి వచ్చిన పిలుపుతో సంక్రాంతి పండుగ ముందు చంద్రబాబు హడావిడిగా ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోసం ఇంకా గట్టిగా ఏడాది సమయం మాత్రమే ఉండటం వల్ల ఏపీకి రావాల్సిన నిధుల గురించి ఇతర డిమాండ్ల గురించి చంద్రబాబు గట్టిగానే మాట్లాడి ఉంటారని అంతా అనుకున్నారు.
ఐతే.. మోడీతో మీటింగ్ తర్వాత చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. ఏపీ కోసం ఏమేం కావాలో అవన్నీ అడిగామని.. ప్రధాని నుంచి సానుకూలమైన స్పందన వచ్చిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ ఎందుకో ప్రెస్ మీట్ తర్వాత చంద్రబాబు ముఖంగా అంతగా ఆనందం కనిపించలేదన్న వాదనలు వినిపించాయి. ఇప్పుడు కొందరు నేతలు దానికి కొత్త భాష్యాలు చెబుతున్నారు. ప్రధానితో చంద్రబాబు భేటీ ఇలా జరిగి ఉంటుందంటూ విశ్లేషణలు వినిపిస్తున్నారు.
చంద్రబాబు అంటే ఇంతెత్తున మండిపడే కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ మోడీ- బాబు భేటీ రహస్యం తనకు తెలుసని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల పొత్తుల గురించి చంద్రబాబును మోడీ అడిగారని ఉండవల్లి అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీట్లన్నీ బీజేపీకి ఇచ్చేసి.. అసెంబ్లీ సీట్లన్నీ తీసుకోవాల్సిందిగా చంద్రబాబుకు మోడీ ప్రపోజల్ పెట్టారట. దీనిపై ఆలోచించి చెబుతానని చంద్రబాబు సమాధానమిచ్రాట. ఇదీ ఉండవల్లి వివరణ.
చంద్రబాబు మాత్రం తమ భేటీలో ఎక్కడా రాజకీయాల ప్రస్తావనే రాలేదని చెప్పారు. అయితే రాజకీయ నాయకులు ఎప్పుడూ తమ భేటీల్లో అసలేం జరిగిందో చెప్పే అవకాశమే లేదు. ఉండవల్లి చెప్పిందే నిజమైతే మోడీ ప్రపోజల్ కు చంద్రబాబు అంగీకరించే పరిస్థితి ఉండబోదు. మొత్తం ఎంపీ సీట్లు బీజేపీకి ఇస్తే గెలిచే సత్తా కూడా ఆ పార్టీకి ఉండదు. అప్పుడు ఇద్దరూ నష్టపోవడం వైసీపీ లాభపడటం ఖాయం.