దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు వందల సంఖ్యలో జరుగుతూనే ఉన్నాయి. వాహనదారులు చేస్తున్న చిన్న పొరపాటు ఎన్నో కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నాయి. ముఖ్యంగా వాహనదారులు వాహనాలు నడిపే ముందు మద్యం సేవించడం..ఓవర్ డ్యూటీలు చేసి నిద్రలేమితో నడపడం..వాహనాలు సరిగా సర్వీసింగ్ చేయించకపోవడం..బ్రేక్ ఫెయిల్ కావడం..ఇలా ఎన్నో కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
కొన్ని సార్లు అనుకోని ప్రమాదాలు..ప్రకృతి అనుకూలించక జరిగే ప్రమాదాల వల్ల కూడా ఎన్నో ప్రాణాలు బలి అవుతున్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఇవాళ తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. మృతులంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు.తుత్తుకుడి జిల్లా దళవాయుపురం వద్ద ఓ వ్యాన్ అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడింది.
ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా, మరో కొంత మంది గాయపడ్డారు. కన్యాకుమారికి వ్యానులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.