ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను సాగనంపడానికి బీజేపీ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోందా.. అంటే ఎస్ అవుననే ఆన్సర్ వస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు నుంచి నరసింహన్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. విభజనానంతరం కూడా ఆయనే ఉంటే సమస్యల పరిష్కారం ఈజీగా ఉంటుందనే నమ్మకంతో కేంద్రం నరసింహన్ ను ఆ పదవిలో కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఇటీవలికాలంలో జరుగుతున్న పలు పరిణామాలు కేంద్రానికి ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది.
గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ రాజ్ భవన్ లో నివాసముంటున్నారు. పదేళ్లపాటు ఆంధ్ర ప్రదేశ్ కు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావడం, ఏపీలో రాజ్ భవన్ నిర్మాణం పూర్తి కాకపోవడం.. తదితర కారణాల వల్ల ఆయన అక్కడే ఉండిపోయారు. ఏపీ పాలన మొత్తం అమరావతికి వచ్చేసినా... గవర్నర్ మాత్రం అక్కడే ఉండిపోయారు. అక్కడ ఉండడాన్ని ఎవరూ అభ్యంతర పెట్టడం లేదు. అయితే ఆయన తెలంగాణ గవర్నమెంట్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది ఆరోపణ.
ఆంధ్రప్రదేశ్ పై గవర్నర్ చిన్నచూపు చూస్తున్నారని ఇక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. హైదరాబాద్ లో ఉండడం, వారానికోసారైనా కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ తో చర్చలు జరుపుతుండడం లాంటి పరిణామాలు సహజంగానే ఏపీ ప్రజలకు కాస్త కోపాన్నితెప్పిస్తున్నాయి. అంతేకాక నాలా బిల్లును ఆరు నెలలపాటు ఆమోదించకుండా తన దగ్గరే ఉంచుకోవడం వారి కోపానికి మరింత ఆజ్యం పోసింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ అంశాన్ని బహిరంగంగా మీడియా ముందు చెప్పేంత వరకూ దీని గురించి ఎవరికీ తెలీదు. ప్రభుత్వం కిమ్మనకుండా ఉండిపోయినా విష్ణుకుమార్ రాజు మాత్రం గట్టిగానే గవర్నర్ పై తన కోపాన్ని వ్యక్తం చేశారు. పూర్తి పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
విష్ణుకుమార్ రాజు తన అసంతృప్తిని వ్యక్తం చేసిన కొన్ని రోజులుగా సాక్షాత్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు.. మా రాష్ట్రానికి ప్రత్యేక గవర్నర్ ను నియమించాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. అధికారపార్టీలో ఉంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేయడం, ప్రత్యేక గవర్నర్ కావాలని డిమాండ్ చేయడం.. లాంటి పరిణామాలు ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయి. అయితే వీరి అసంతృప్తి వెనుక, మాటల తూటాల వెనుక బీజేపీ అధిష్టానం ఉందేమోననే అనుమానాలు తలెత్తుతున్నాయి.
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ కలలు కనింది. ఇందుకోసం గవర్నర్ ను కూడా వాడుకోవాలని ప్లాన్ వేసింది. అయితే అక్కడ బీజేపీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ప్రతిపక్షంగా బీజేపీ తదితర పార్టీలు గవర్నర్ ను కలిసి అధికార టీఆర్ఎస్ పై కంప్లెయింట్ చేసినప్పుడు ఆయన పెద్దగా పట్టించుకోకపోవడం, పైగా వెళ్లినవారిపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటి పరిణామాలు సహజంగానే కేంద్రానికి ఆగ్రహం తెప్పించాయి. తెలంగాణ బీజేపీ నేతలు కూడా గవర్నర్ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ అసంతృప్తిని తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుపెట్టించడం ద్వారా తన యాక్షన్ ప్లాన్ ను కేంద్రం అమలు చేస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.