తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు ప్రకాశ్ రాజ్. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడే నైజం ఉన్న ప్రకాశ్ రాజ్ గత కొంత కాలంగా బీజేపీ పరిపాలనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గత సంవత్సరం అక్టోబర్లో తన మిత్రురాలు, సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యా ఉదంతం జరిగినప్పటి నుంచి వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ వస్తున్నారు ప్రకాష్ రాజ్. ఒకానొక సమయంలో ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని తప్పుబడుతూ తన అవార్డులు వెనక్కి ఇచ్చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి ప్రకాశ్ రాజ్ వర్సెస్ బీజేపీ కార్యకర్తల మద్య సైలెన్స్ వార్ నడుస్తుంది. ఇటీవల సిర్సిలోని రాఘవేంద్ర మఠంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ‘మన రాజ్యాంగం- మన హోదా’ అనే వామపక్ష మేధావులు ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డెపై ప్రకాష్రాజ్ విమర్శలు చేశారు.
అనంత్ కుమార్ హెగ్గే రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ మాట్లాడటం బీజేపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ప్రకాష్ రాజ్ ప్రసంగం ముగించి వెళ్లిన కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న బీజేపీ యువమోర్చా కార్యకర్తలు వేదికపై గోమూత్రం చల్లి శుభ్రపరిచారు. తమ పుణ్యక్షేత్రాన్ని కొంతమంది సోకాల్డ్ మేధావులు అపవిత్రం చేశారని, అందుకే గోమూత్రంతో శుద్ధి చేశామని బీజేపీ యువ మోర్చా నేత విశాల్ మరాటె అన్నారు.
ఇటువంటి అసాంఘిక వామపక్ష మేధావులను సమాజం క్షమించదని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో స్పందిస్తూ తాను ఎక్కడికి వెళ్లినా బీజేపీ కార్యకర్తలు ఇలాగే చేస్తారా అన్నారు. ట్వీట్ చివరన జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ టాగ్ను కూడా జత చేశారు. ప్రకాష్ రాజ్ కొద్ది రోజులుగా జస్ట్ ఆస్కింగ్ అనే టాగ్తో ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.