తమిళనాడు రాజకీయాలు సరికొత్త దిశగా ప్రయాణం చేస్తున్నాయి. మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో చెలరేగిన అస్థిరత నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, విశ్వనటుడు కమల్ హాసన్లు కొత్తగా పార్టీలు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రజనీ తాను పార్టీ పెట్టేది ఖాయమని చెప్పి.. అభిమానులను ఉర్రూత లూగించాడు. కమల్ మాత్రం ఇంకా దోబూచులాడుతున్నాడు. తాను పార్టీ పెడతానని, అయితే, ఎప్పుడు పెట్టేదీ త్వరలోనే వెల్లడిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, ఇంతలోనే అధికార పార్టీ అన్నాడీఎంకే వర్గంలోని అసమ్మతి నేత, చిన్నమ్మ శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తాజాగా సొంత పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
జయ మరణం తర్వాత అధికార పార్టీలో చెలరేగిన రాజకీయ అస్థిరత నేపథ్యంలో పార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జయ ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఈ క్రమంలో అన్నడీఎంకే అసమ్మతి నేతగా ఉన్న దికరన్.. తనకు రెండాకుల గుర్తును కేటాయించాలని ఎన్నికల సంఘం అధికారులను కోరడంతోపాటు వారికి పది కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యాడు. దీంతో ఇది కేసుగా మారి దినకరన్ జైలుకు కూడా వెళ్లాడు. ఇక, ఇటీవల నిర్వహించిన ఆర్కే నగర్ ఎన్నికల్లో దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేవారు. రైస్ కుక్కర్ గుర్తుపై పోటీ చేసిన ఆయన గతంలో జయ సాధించిన ఓట్ల కంటే అత్యధిక ఓట్ల మెజార్టీ సాధించి.. గెలుపొందారు.
అయితే, జయ పార్టీ అన్నాడీఎంకే ను సొంతం చేసుకోవాలని భావించినా.. ఇప్పుడున్న పరిస్థితిలో ఇది సాధ్యం కాదని గ్రహించిన దినకరన్.. తానే సొంతంగా పార్టీ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. అన్నాడీఎంకే శశికళ వర్గంగా ప్రజల్లోకి వెళ్లాలని, తాము మాత్రమే అమ్మ.. జయలలితకు నిజమైన, అసలు సిసలైన వారసులమని ఆయన పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆయన సొంత పార్టీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈయనకు మద్దతుగా 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో 40 మంది వరకు గోప్యంగా మద్దతిస్తున్నారని దినకరన్ వర్గం చెబుతోంది.
సొంతంగా పార్టీని ప్రకటిస్తే.. వీరంతా త్వరలోనే తన గొడుగు కిందకి చేరడం ఖాయమని భావించిన దినకరన్ ఆదిశగా పావులు కదుపుతున్నారు. ఇదే జరిగితే.. తమను నిలువునా ముంచిన సీఎం పళనిస్వామి వర్గానికి గట్టిగా బుద్ధి చెప్పినట్టు అవుతుందని కూడా దినకరన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సొంత పార్టీ ప్రకటన, ఎజెండా, జెండాలను కూడా వివరించనున్నట్టు దినకరన్ వర్గం ప్రచారం ముమ్మరం చేసింది.