ఈ మద్య తమ అభిమాన హీరోల విషయంలో అభిమానులు కాస్తంత అతి చేస్తున్నారనే అనొచ్చు. ముఖ్యంగా తమిళ నాట అభిమానులు తమ అభిమాన హీరో విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కారన్న విషయం పలు సంఘటనలు ద్వారా రుజువైంది. తాజాగా తమిళనాడులో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ మీద ప్రముఖ హీరో విజయ్ అభిమానులు కత్తులతో దాడి చేశారు. రజనీకాంత్, విజయ్ అభిమానులు గొడవతో ఈ రోడ్ జిల్లాలోని పలు ప్రాంతాలు ఉద్రిక్తంగా మారిపోయాయి.
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గోపిషెట్టిపాళయం సమీపంలో ఉన్న పారియూర్ కొండత్తు కాళియమ్మన్ ఆలయంలో ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాల సందర్భంగా తమ అభిమాన హీరో రజినీకాంత్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కొంత మంది యువకులు. అయితే నంజకౌంటన్ ప్రాంతానికి చెందిన విజయ్ అభిమానులు రత్నవేల్, త్యాగు, సతీష్ అనే ముగ్గురు కలిసి రజనీకాంత్ అభిమానులు జగదీషన్, పళనిస్వామి లను అక్కడ రజినీ ఫ్లెక్సీలు ఎందుకు ఏర్పాటు చేశారని గొడవ పడ్డారు.
అంతే కాదు రజనీకాంత్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కాల్చివేశారు. దీంతో తమ హీరో ఫ్లెక్సీలను ఎందుకు తగులబెడుతున్నారని జగదీషన్, పళనిస్వామి వారికి ఎదురు తిరిగారు. దీంతో ఆగ్రహించిన విజయ్ అభిమానులు రత్నవేల్, త్యాగు, సతీష్ తమతో తెచ్చుకున్న కత్తులతో వారిపై దాడిచేశారు. తీవ్రగాయాలైన రజనీకాంత్ అభిమానులు జగదీషన్, పళనిస్వామి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన గోపిషెట్టి పాళయం పోలీసులు విజయ్ అభిమానులు రత్నవేల్, సతీష్, త్యాగులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి జైలుకు పంపించారు. తర్వాత రజనీకాంత్, విజయ్ అభిమానులను పోలీస్ స్టేసన్ కు పిలిపించి ఇక ముందు ఇలాంటి సంఘటనలు ఎదురుకాకుండా చూడాలని, జాగ్రత్తగా ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చారు.