ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో మగవారితో సమానంగా దూసుకు పోతున్నారని ఇప్పటికే పలు సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా భారత దేశంలో ఎంతో మంది మహిళలు సాహసకృత్యాలు చేస్తూ మగవారితో మేమూ సమానమని చాటుకున్నారు. తాజాగా సుఖోయ్ యుద్ధవిమానంలో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. డోక్లాం వివాద సమయంలో కూడా అత్యంత చొరవ తీసుకుని ఆమె భారత-చైనా సరిహద్దుల్లో స్వయంగా పర్యటించారు.
రాజస్థాన్లోని జోధ్పూర్ ఎయిర్ బేస్ నుంచి బుధవారం నిర్మల సుఖోయ్ ఎస్యు-30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పట్నించి నిర్మలా సీతారామన్ ఆ పదవికే వన్నె తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. సీతారామన్ కంటే ముందు 2003లో అప్పటి రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ సుఖోయ్–30 విమానంలో చక్కర్లు కొట్టారు.
సుఖోయ్లో ప్రయాణించిన తర్వాత సీతారామన్ మాట్లాడుతూ నాకు ఇంత గొప్ప అనుభూతిని అందించిన ఎయిర్ఫోర్స్ సిబ్బందికి కృతజ్ఞతలు. దృఢత్వం, ప్రాక్టీస్, సంసిద్ధత, పరిస్థితులకు అనుగుణంగా భద్రతా సిబ్బంది ఎలా స్పందిస్తారు వంటి విషయాలను అర్థం చేసుకుని నాకు నేనే చెప్పుకున్నాను. నేను రెప్ప వాల్చలేదు.
ఇదో జ్ఞాపకంగా మిగిలిపోతుంది’ అని నిర్మాలా సీతారామన్ చెప్పారు. ఈ ప్రయాణానికి ముందు ఐఏఎఫ్ ఎయిర్బేస్ నిర్వహణ, యుద్ధ సన్నద్ధతపై ఆమె సమీక్ష నిర్వహించారు. కాగా, రక్షణమంత్రి ప్రయాణించిన విమానం 8 వేల మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ ధ్వని వేగాన్ని అధిగమించిందని ఓ ఐఏఎఫ్ అధికారి తెలిపారు. సుఖోయ్ 30 ఎంకేఐ అణు సామర్థ్యమున్న ఎయిర్క్రాఫ్ట్. ఇది శత్రు భూభాగంలోకి చొచ్చుకు పోయి విధ్వంసం సృష్టించగలదు.