నా పనితీరు భేష్! నాలాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వారు లేరు. మరుసటి ఎన్నికల్లోనూ నన్నే ఎన్నుకోవాలి. లేకుంటే మీరు అనుభవిస్తారు! అని ఏపీ ప్రజలను ఉద్దేశించి పదే పదే ప్రసంగాలతో దుమ్మురేపే సీఎం చంద్రబాబు పనితీరుపై మదింపు జరగబోతోందా? బాబు పనితనాన్ని కొలిచేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తన దూతను పంపుతున్నారా? ఇక, బాబు ఇక్కడ ఏం చేస్తున్నారో? ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా మోడీ తన మనిషి ద్వారా కూపీలా గుతున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది.
ఇటీవల చంద్రబాబు ప్రధాని మోడీతో దాదాపు 40 నిముషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహా.. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ఏకరువు పెట్టారు. మీరు ఆదుకోకపోతే.. మా పని ఖతం అని కూడా బాబు మోడీకి మోకరిల్లారు. అయితే, బాబు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో బీజేపీ నేతల నుంచి తనకు అందిన సమాచారానికి మధ్య పొంతన కుదరకపోవడంతో ప్రధాని మోడీ.. తనకు అత్యంత విశ్వసనీయులైన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ను ఆయన ఏపీకి పంపారు.
ఏపీలో జరుగుతున్న నిర్మాణాలు, పాలన తీరును ఈయన స్టడీ చేయనున్నారని సమాచారం. పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శిస్తారు. ఈ పర్యటన నిధుల మంజూరు కోసం అని అధికార వర్గాలు చెప్తుండగా... గతంలో వివిధ రూపాల్లో కేంద్రానికి వెళ్లిన ఫిర్యాదులపై ఆరా తీసేందుకని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గత కొన్నాళ్లుగా బీజేపీ నేతలు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర బీజేపీలోని కొందరు నేతలు కూడా ఏపీలో పర్యటించి వెళ్లారు.
ఇలా పర్యటించిన వారు.. ఏపీలో అభివృద్ధి కన్నా ప్రచారం ఎక్కువగా ఉందని, పోలవరం ప్రాజెక్టు పనులు కూడా కాంట్రాక్టర్కు అనుకూలంగా ఉన్నాయని, ప్రభుత్వ సొమ్మును ధారాళంగా ఖర్చు చేస్తూ.. డిజైన్లను సైతం ఎప్పటికప్పుడు మారుస్తున్నారని కేంద్రానికి వెల్లడించారు. ఇక, కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వమే పేర్లు పెట్టుకుని ప్రజల్లో ప్రచారం చేసుకుంటోందని సోము వీర్రాజు బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారని ఇది ఎంత మాత్రమూ సహించరాని విషయమని కూడా వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో బాబు పనితీరు అంచనా వేసేందుకు ప్రధాని మోడీ ఇప్పుడు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిని పంపచడం చర్చకు దారితీస్తోంది.
నీతి ఆయోగ్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తున్నందున రాష్ట్రంలోని పరిస్థితులను అధ్యయనం చేసిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు.. ఆయా విషయాలను మోడీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం కూడా ఆయనకు ఏయే అంశాలు నివేదించాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. ఇదిలాఉండగా.... నీతి అయోగ్ ఉపాధ్యక్షుడిని కలిసేందుకు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ఏదేమైనా.. చంద్రబాబు పాలనపై మోడీకి అంత విశ్వసనీయత లేదనడానికి ఈ ఘటన ప్రధాన ఉదాహరణగా ఉండడం గమనార్హం. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని విషయాలు తెరమీదకి వస్తాయో చూడాలి.