తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు మూడ్లో ఉన్నట్టే కనపడుతోంది. కొద్ది రోజులుగా ఆయన తన సన్నిహితులతో లోక్సభ ఎన్నికల ముందస్తు ముచ్చట గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారని తెలుస్తోంది. లోక్సభకు ముందస్తు ఎన్నికలు వస్తే ఒకేసారి జమిలీ ఎన్నికలకు వెళ్లాలని కూడా కేసీఆర్ రెడీ అవుతున్నారు. కేసీఆర్ అంచనా ప్రకారం ఈ యేడాది నవంబర్లోనే లోక్సభకు ఎన్నికలు ఉంటాయని, అదే జరిగితే నవంబర్లోనే జమిలీ ఎన్నికలకు వెళ్లిపోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న కేబినెట్తో ఎన్నికలకు వెళ్లేందుకు ఇష్టపడని కేసీఆర్ కేబినెట్ను ప్రక్షాళన చేసి మార్పులు, చేర్పులతో ఎన్నికలకు వెళితే మంచిదన్న ఆలోచనలో ఉన్నట్టే తెలుస్తోంది. టీ కేబినెట్ కూర్పులో ఇప్పటికే కొన్ని విమర్శలు ఉన్నాయి. మహిళలకు ప్రాథినిత్యం లేదని, కొందరు మంత్రుల పనితీరు సరిగా లేదని ఇలా చెప్పుకుంటూ పోతే విపక్షాలు, తెలంగాణ ప్రజానీకం నుంచే కాకుండా స్వపక్షంలోనూ విమర్శలు ఉన్నాయి. ఇక కేబినెట్లో మార్పులు, చేర్పులు చేస్తే కొందరిని తప్పించి కొత్త ముఖాలకు చోటు ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక కేబినెట్ కొత్త కూర్పుపై కేసీఆర్ గజ్వేల్ పర్యటన అనంతరం తన ఫామ్హౌస్లోనే కసరత్తులు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కొత్తగా కేబినెట్లోకి ఇన్ లిస్టులో తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గురు, శుక్రవారాల్లో హైదరాబాద్లో అందుబాటులో ఉండాలని ఆయనకు సీఎంవో నుంచి ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన తన సన్నిహితులకే చెప్పినట్టు మీడియా వర్గాలకు లీక్ అయ్యింది.
స్వామిగౌడ్కు తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో మంచి గ్రిప్ ఉంది. ఆయన్ను కేబినెట్లోకి తీసుకుంటే అదే వర్గానికి చెందిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగల పద్మారావు గౌడ్ను తప్పించనున్నారు. ఇక హోం మంత్రి నాయిని నరసింహారెడ్డిని తప్పించి ఆయన స్థానంలో పద్మాదేవేందర్ రెడ్డి లేదా - ఉమామాధవరెడ్డిలను తీసుకోవచ్చని సమాచారం. నల్గొండలో పార్టీని బలోపేతం చేయాలని అనుకుంటే ఉమాకే ఛాన్స్ ఇవ్వవచ్చంటున్నారు. ఇక మహిళా కోటాలో మంత్రి పదవి ఇలా భర్తీ చేసి తనపై వస్తోన్న విమర్శలకు కేసీఆర్ చెక్ పెట్టనున్నారు.
ఇక పనితీరు పరంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్న అజ్మీరా చందూలాల్ను తప్పించి ఆయన స్థానంలో రెడ్యానాయక్ ను తీసుకునే అవకాశాలున్నాయి. ఇక స్వామిగౌడ్ ను మంత్రిని చేస్తే శాసనమండలి చైర్మన్ గా ఆయన స్థానంలో పాతూరి సుధాకరరెడ్డిని నియమించొచ్చని సమాచారం. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఇద్దరు ముగ్గురు మంత్రులపై విమర్శలు వస్తున్నా ... వారిని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తప్పించకపోవచ్చని తెలుస్తోంది.