ఎన్టీవర్ వర్థంతి సందర్భంగా బుధవారం టీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ, టీడీపీలోను ప్రకంపనలు రేపుతున్నాయి. కొద్ది రోజులుగా టీడీపీలోనూ, చంద్రబాబు తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన తన బాధను కక్కలేక, మింగలేక ఉంటున్నారు. మోత్కుపల్లికి గవర్నర్ గిరి వచ్చేస్తుందని మూడేళ్లుగా అదిగో పులి, ఇదిగో తోక అన్న చందంగా ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మోత్కుపల్లికి గవర్నర్ పదవిపై కేంద్రంతో చర్చించారని, ఇక గవర్నర్ పదవి రావడమే ఆలస్యమని ప్రచారం జరుగుతోంది. అయితే మూడున్నరేళ్లుగా ఇదంతా ప్రచారానికి మాత్రమే తప్పా నిజంగా ఆయనకు పదవి మాత్రం రావడం లేదు. ఇక గవర్నర్ పదవిపై ఆశలు వదులుకున్న మోత్కుపల్లి వచ్చే మార్చిలో జరిగే రాజ్యసభ స్థానానికి అయినా తన పేరును దళిత కోటాలో పరిశీలించాలని చంద్రబాబుకు పదే పదే విన్నవించుకుంటున్నారు.
అయితే తెలంగాణలో టీడీపీకి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఏపీ కోటాలో మోత్కుపల్లిని రాజ్యసభకు పంపేందుకు బాబు ఏ మాత్రం ఇష్టపడడం లేదు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ ఓట్ల కోసం ఆయన ఈక్వేషన్లు, లెక్కలు ఆయనకు ఉన్నాయి. ఈ క్రమంలో మోత్కుపల్లిని రాజ్యసభకు పంపేముందే ఏపీ నుంచే ఓ ఎస్సీ వర్గానికి చెందిన వారిని రాజ్యసభకు పంపితే అది పార్టీకి చాలా మేలు అవుతుంది. దీంతో ఏపీ కోటాలో ఏపీ వారినే రాజ్యసభకు పంపనని ఖరాఖండీగా చెప్పేశారు.
చివరకు టీడీపీని, బాబును నమ్ముకుని ఉంటే లాభం లేదని, పొలిటికల్ ఫ్యూచర్ లేదని డిసైడ్ అయిన మోత్కుపల్లి ఎన్టీవర్ వర్థంతి కార్యక్రమాన్నే తన అసంతృప్తికి వేదికగా చేసుకున్నారన్న చర్చలు నడుస్తున్నాయి. తెలంగాణలో పార్టీ పూర్తిగా లేదనిపించుకోవడం కంటే.. టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయడమే మంచిదన్నారు. టీఆర్ఎస్ కూడా మన పార్టీనే..కేసీఆర్ మన దగ్గర నుంచి వెళ్లిన నేతనే అని ఆయన గుర్తుచేశారు. పార్టీని విలీనం చేస్తే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు.
ఇక టీఆర్ఎస్ను, కేసీఆర్కు బద్ధ శత్రువుగా ఉంటే మోత్కుపల్లి వీరిని పొగడడమంటే టీడీపీని వీడి అధికార పార్టీలో చేరాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక వచ్చే మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికలకు కాస్త ముందుగానే ఆయన గులాబీ కండువా కప్పుకుని ఆ పార్టీ తరపున రాజ్యసభకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ కూడా మోత్కుపల్లి లాంటి సీనియర్, దళిత నేత పార్టీలోకి వస్తానంటే రెడ్ కార్పెట్ వేసి తీసుకోవడంతో పాటు పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆయన్ను రాజ్యసభకు పంపుతారని వినిపిస్తోన్న టాక్.