నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ టీడీపీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు తెలంగాణలో టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇది తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిపోయింది. ఈ అంశంపై పలువురు నేతలు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. తాజాగా ఇందే అంశంపై వైసీపీ నాయకురాలు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..తెలంగాణ టీడీపీలో బలహీనతను మరోసారి బహిర్గతం చేశాయని అన్నారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఎంతో గొప్ప విలువలు కలిగిన టీడీపీ పార్టీ ఇప్పుడు బ్రస్టు పట్టిపోతుందని వాపోయారు. ఆ పార్టీలో పేరుకుపోయిన అవకాశవాదులను, అత్యాశపరుల జాడలను ఎండగడుతుండడం విశేషం. పార్టీలో అంతా స్వార్థపరులు తయారయ్యారని, వటవృక్షం లాంటి పార్టీని నాశనం చేశారని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ ఇంత హీనస్థితికి దిగజారిన వైనాన్ని ప్రశ్నించే నాథుడే లేడంటూ.. పరోక్షంగా చంద్రబాబు వల్ల కలిగిన నష్టాన్ని గుర్తు చేశారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ హయాంలో కళకళలాడిన పార్టీలో చోటు చేసుకున్న అనేక నాటకీయ పర్యవసానాల కారణంగా ఆయన్ని తప్పించడం, చంద్రబాబు అధికారంలోకి రావడం.. ఆ తరువాత దాదాపు 20 ఏళ్లకే సగం తెలుగు ప్రాంతంలో కనుమరుగు అయ్యింది..ఇదంతా వారి పాప ఫలితమే అన్నారు.
చంద్రబాబు సహా టీడీపీలో ఇప్పుడున్న నాయకులందరూ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ద్వారా రాజకీయంగా ఎదిగినవారే కావడం విశేషం. తాజాగా మోత్కుపల్లి చేసిన కామెంట్లు కూడా రాజకీయ భవిష్యత్ ను సుస్థిరం చేసుకునే ఎత్తుగడల్లో భాగంగానే అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్న క్రమంలో.. లక్ష్మీపార్వతి ఆవేదనాభరితమైన వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.