వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జగన్ పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే 60 రోజులకు పైగా యాత్ర చేశారు. తన తండ్రి బాటలోనే తాను అధికారంలోకి రావడానికి ఈ యాత్ర దోహదపడుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. యాత్ర ఏమేరకు ఉపయోగపడుతుందో ఏమో కానీ ... అర్నాబ్ గోస్వామి మాత్రం వచ్చే ఎన్నికల్లో జగన్ దే గెలుపని తేల్చేశాడు.
ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే టైముంది. ఇప్పటి నుంచే అధికార ప్రతిపక్షాలన్నీ అధికారం కోసం ఎత్తులుపైఎత్తులు వేస్తున్నాయి. అధికార టీడీపీ పెద్దఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తనవైపుకు లాక్కొంది. వారిలో కొంతమందికి మంత్రిపదవులను కూడా కట్టబెట్టింది. మరింత మందిని చేర్చుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మరోవైపు జగన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నాడు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే తపనతో పాదయాత్ర చేపట్టారు. తప్పకుండా ఈసారి గెలుపు తనదేననే నమ్మకంతో ఉన్నారు. ఆయన నమ్మకానికి రిపబ్లిక్ టీవీ కాస్త ఊపిరినిచ్చింది. ఈ నెలలో దేశవ్యాప్తంగా సీఓటర్ తో కలిసి రిపబ్లిక్ టీవీ సర్వే చేసింది. దాని ఫలితాలను బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి అధికార టీడీపీ కంటే ఇతరులకే ఎక్కువ అవకాశాలున్నట్టు ఆ సర్వే సారాంశం.
ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏకి అంటే.. టీడీపీ-బీజేపీ కూటమికి 12 పార్లమెంటు స్థానాలు దక్కుతాయని తేల్చింది. అంటే 2014తో పోల్చింతే 5 స్థానాలు తగ్గుతాయని అభిప్రాయపడింది. అదే సమయంలో ఇతరులకు అంటే.. ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన పార్టీలేవీ లేకపోవడంతో ఇక్కడ ప్రతిపక్ష వైసీపీకి 13 స్థానాలు వస్తాయని తేల్చింది. అంటే గతంతో పోల్చితే 5 స్థానాలు పెరుగుతాయని వెల్లడించింది. అంటే అధికార టీడీపీ కంటే ప్రతిపక్ష వైసీపీకి ఓ స్థానం పెరుగుతుంది.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఈసారి కూడా ఏమాత్రం ప్రజాదరణ దక్కదని తేల్చేసింది. ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ గెలిచే అవకాశం లేదని వెల్లడించింది. అయితే కాంగ్రెస్, వైసీపీలు కలిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని మాత్రం సర్వే తేల్చింది. రిపబ్లిక్ టీవీ కథనం వైసీపీ శ్రేణులకు పెద్ద బూస్టప్ ఇచ్చినట్టే.! అధికార పార్టీ ఎత్తులకు శ్రేణులన్నీ చిత్తవుతున్న వేళ.. ప్రతిపక్షానికే ప్రజాదరణ ఉంటుందంటూ కథనం రావడం పెద్ద సంచలనమే.!
అయితే ఇటీవలే రిపబ్లిక్ టీవీ జగన్ కేసులపై ఓ ప్రత్యేక చర్చ చేపట్టింది. ఆయనపై పెట్టిన కేసులన్నీ బూటకమనేది ఆ చర్చ సారాంశం. అయితే ఈ చర్చను ఈ సమయంలో చేపట్టడం వెనుక లోతుపాతులపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదొక “పెయిడ్ డిబేట్” లాగా ఉందనే విమర్శలు మీడియా వర్గాల్లో విస్తృతంగా వ్యక్తమయ్యాయి. ఇప్పుడేమే ప్రతిపక్షానికే ఎడ్జ్ ఉందంటూ సర్వే రిపోర్ట్ తేల్చడం ఆ “పెయిడ్ డిబేట్”కు మరింత ఊతాన్నిచ్చింది.