ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్–2018 అనే కార్యక్రమం హైదరాబాదులోని పార్క్ హయాత్ అనే హోటల్ లో ఈ నెల 18,19 తేదీలలో జరగనుంది. నిన్న ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమయింది. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కూడా హాజరయ్యారు.
ఇందులో చర్చాగోష్టిలో పాల్గొన్న ఆయన వ్యాఖ్యాత అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ తో విలీనం చేయక ముందు కూడా ధనిక రాష్ట్రమేనని, ఆంధ్రతో తెలంగాణను పోల్చొద్దని అన్నారు. తెలంగాణ మిగులు రాష్ట్రమని, ఏపీకంటే చాలా విషయాల్లో ఎంతో ముందుందని, అసలు తెలంగాణాకు ఆంధ్రతో పోలికే లేదని ఆయన వ్యాఖ్యలు చేశారు.
ఆయన అన్న మాటలు ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడును బాగా కలచివేసినట్లున్నాయి. కాగా అమరావతిలో నేడు జరిగిన రెండోరోజు కలెక్టర్ల సమావేశంలో బాబు మట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్కు పోలికే లేదని కేసీఆర్ అనడం బాధాకరమని ఆయన వెల్లడించారు.దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉండటానికి కారణం ప్రజలు కాదని, రాష్ట్ర విభజన వల్ల కలిగిన నష్టం అని ఆయన అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం ఇంకా 35వేలు పెరిగితే పొరుగు రాష్ట్రాలతో సమానముగా మెలగవచ్చని ఆయన అధికారులనుద్దేశించి మాట్లాడారు.
ఇతర రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేవరకూ ఏపీని కేంద్రమే ఆదుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అవసరం అనిపిస్తే ఆఖరుకి సుప్రీంకోర్టుకు కూడా వెళతామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వల్ల తాము కోల్పోయినదంతా త్వరలోనే కేంద్రంతో పోరాడి సాధిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.ఇక కేంద్రం సాయం చేసే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఏదీ ఏమయినా రాష్ట్రం విడిపోయిన మాత్రాన పొరుగు తెలుగు రాష్ట్రాన్ని అలా అన్నందుకు సీఎంతో పాటు సామాన్య ఆంధ్రప్రజలు కూడా ఒక్కింత బాధకు లోనయ్యారని చెప్పవచ్చు.