దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతోందనేది రిపబ్లిక్ టీవీ సర్వే సారాంశం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గత ఎన్నికల కంటే మిన్నగా దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అర్నాబ్ గోస్వామి స్పష్టం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అధికార బీజేపీ మాత్రం ఓడిపోతుందని తేల్చేశారాయన. ఇక్కడ మాత్రం ప్రతిపక్ష వైసీపీ అధికారంలోకి వస్తుందని సెలవిచ్చారు. దేశమంతా కమలం హవా కొనసాగుతున్నవేళ.. ఎంత బలమైన మిత్రపక్షం టీడీపీ ఉన్నచోట బీజేపీ ఓడిపోతుందని చెప్పడానికి కారణమేంటి..?
... ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇది.! రిపబ్లిక్ టీవీ కథనం వెనుక ‘ఏదో ఉంద’నేది డౌట్. ఇందుకు ఆధారాలు లేకపోలేదు. కొంతకాలంగా కేంద్రంతో రాసుకుపూసుకు తిరుగుతోంది ప్రతిపక్ష వైసీపీ. ఎలాగైనా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని ట్రై చేస్తోంది. ఇందుకోసం ఎన్డీఏ పక్షాలన్నింటితో అంటకాగుతోంది. పిలవని పేరంటాలకు కూడా వైసీపీ నేతలు హాజరయ్యారనే విమర్శలు కూడా వచ్చాయి.
అర్నాబ్ గోస్వామి నేతృత్వంలో నడుస్తున్న రిపబ్లికి టీవీకి ఓ బీజేపీ ఎంపీ అధినేత. దీంతో.. నిర్మొహమాటంగా అది బీజేపీ ఛానలే.! జాతీయ ఛానళ్లన్నీ దాన్ని, అర్నాబ్ గోస్వామిని బీజేపీ తొత్తుగానే అభివర్ణిస్తుంటారు. పైగా బీజేపీపై మాట పడనీయకుండా ఆయన డిబేట్లు సాగుతుంటాయి. ఇందుకు చాలా ఉదాహరణలున్నాయి. అలాంటి అర్నాబ్ గోస్వామి దేశవ్యాప్తంగా బీజేపీకి జైకొట్టి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వైసీపీని ‘గెలిపించడం’ వెనుక ప్రత్యేక కారణాలున్నాయనేది విశ్లేషకుల అంచనా.
సర్వే ఫలితాలు వెల్లడించక కొన్ని రోజుల ముందు రిపబ్లిక్ టీవీ జగన్ అక్రమాస్తులు- కేసులపై ప్రత్యేక చర్చనే చేపట్టింది. జగన్ పై పెట్టిన కేసులన్నీ అక్రమమేనని ఆ డిబేట్ తేల్చింది. అప్పట్లోనే ఇద పెయిడ్ డిబేట్ అనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సర్వేలో కూడా జగన్ కు అనుకూలంగా ఫలితాలు ఇవ్వడంతో ఆ పెయిడ్ బాండింగ్ మరింత బలపడింది.
వ్యక్తిగతంగా తనపై పెట్టిన కేసులను తక్కువగా చేసి చూపించడం, ఆంధ్రప్రదేశ్ లో తన పార్టీ బలంగా ఉందని చెప్పుకునేందుకు ప్రయత్నించడం.. ఇవీ రిపబ్లిక్ టీవీ ద్వారా వైసీపీ వేసిన ఎత్తుగడలు. ఇందుకు ప్రశాంత్ కిషోర్ వెనకుండి నడిపించాడనేది తాజా గుసగుస. మొత్తానికి ఈ స్ట్రాటజీని అమలు చేయడంలో అటు ప్రశాంత్ కిశోర్, ఇటు వైసీపీ సక్సెస్ అయ్యాయి. అయితే ఇలా పెయిడ్ ఆర్టికల్స్, డిబేట్స్ వల్లే గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందనేది సుస్పష్టం. ఇలాంటివి నేలవిడిచి సాము చేయడం లాంటివి మాత్రమే. ఆ విషయం గ్రహించి గ్రౌండ్ వర్క్ చేస్తే తప్ప ఫలితాలు ఆశాజనకంగా ఉండవు.