తెలంగాణలో మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వీలు చిక్కినప్పుడల్లా బీజేపీపై విమర్శనాస్త్రాలు సందిస్తుంటారు. ముఖ్యంగా మోదీపై ఆయన పాలనపై ప్రతిసారి విమర్శలు చేసే ఓవైసీ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్ తలాక్ అంశాన్ని మోడీ లేవనెత్తడం వల్లే ముస్లింలందరూ ఏకమయ్యారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందుకే మోడీకి కృతజ్ఞతలు తెలిపారు ఒవైసీ.
తాజాగా కర్నూలులో పర్యటించిన ఎంపీ ఒవైసీ మాట్లాడుతూ.. ముస్లిం మహిళలపై కేంద్రానికి నిజంగా ప్రేమ ఉంటే బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించి.. ప్రతీ మహిళకు రూ.25 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఎవరైనా పలుమార్లు తలాక్ చెబితే వారిని సంఘ బహిష్కరణ చేయాలని ఎంపీ పిలుపు నిచ్చారు. ముస్లిం వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు వస్తున్నాయని..అందరూ చైతన్య వంతులు అవుతున్నారని ఆయన అన్నారు.
సమస్యలేవైనా ఉంటే మత పెద్దల వద్ద పరిష్కరించుకోవాలని అసదుద్దీన్ సూచించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 11న హైదరాబాద్లో సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై స్పందిస్తూ.. ఆ సమస్య కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడబోనని పేర్కొన్నారు.