గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అధికార పార్టీపై పలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మద్య అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడంతో బోర్ కొడుతోందని, అసెంబ్లీలో ప్రశ్నించే అవకాశం లేకపోవడంతో నిద్రొస్తోందని ఏపీ బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు వైసీపీ పై సంచలన వ్యాఖ్యానించారు.
అంతే కాదు ఏపీలో పార్టీలు మారిన నేతలు తమ పదవులకు రాజీనామాలు సమర్పిస్తే కనుక ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని అన్నారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలపై తనదైన స్టైల్లో స్టేట్ మెంట్స్ ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు విష్ణుకుమార్ రాజు.
తాజాగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖలో తహసీల్దార్, ఆర్అండ్బీ ఈఎన్సీపై ఏసీబీ సోదాలు జరిపించానని, వందల కోట్ల అవినీతి సొమ్మును జప్తు చేయించానని చెప్పారు. భూమిపై స్థలం లేకుంటే సముద్రంలో కూడా మద్యం దుకాణం పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం విధానం ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు.
రాష్ట్రంలో రైతులకు పగటి పూటే 10 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో 10లక్షల ఐటీ ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అవినీతి, రౌడీయిజం వల్లే రాష్ట్రంలో ఇసుక ధరలు పెరిగాయని వ్యాఖ్యానించారు.