క్రమశిక్షణకు తెలుగుదేశం పార్టీ మారుపేరు. ఏమాత్రం తేడా వచ్చినా అధినేత చంద్రబాబు ఆగ్రహానికి లీడర్లు గురవుతుంటారు. తాజాగా టీడీపీ వర్క్ షాప్ లో కూడా పలువురు నేతలు చంద్రబాబు సీరియస్ అవడానికి కారణమయ్యారు. వారి వ్యవహార శైలి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
పార్టీ ఎమ్మెల్సీల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు చేయోద్దంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు చెప్పిందే ఫైనల్ అంటూ సూచించారు. ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది ఎమ్మెల్సీల తీరు మారకపోవడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీల వ్యవహరశైలి సరిగా లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పదవి లేని వారికి ఎమ్మెల్సీ పదవులు కట్టపెడితే ఎమ్మెల్యేలకు అడ్డంకులు సృష్టించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రూపు రాజకీయాలు చేస్తున్న ఎమ్మెల్సీలకు సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చెప్పిందే ఫైనల్ అంటూ తేల్చి చెప్పేశారు. ఇదే విషయాన్ని గతంలో అనేక సార్లు చెప్పినా కొందరు ఎమ్మెల్సీలు వినకపోవడంతో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరి వ్యవహారం ఏంటో అంతా నాకు తెలుసని.. పార్టీ విలువలకు కట్టుబడి ఉండకపోతే ఈ సారి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.
ప్రధానంగా ఎమ్మెల్సీలు కరణం బలరామ్, రామసుబ్బారెడ్డి, యలమంచిలి రాజేంద్రప్రసాద్, బచ్చుల అర్డునుడు, పోతుల సునీతలను ఉద్దేశించి సీయం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అద్దంకి నియోజకవర్గంలో కరణం బలరామ్ వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలులో జరిగిన సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవిపైకి దూసుకెళ్ళడం.. అలాగే సచివాలయంలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కూడా కరణం బలరాం వ్యవహరించిన తీరుపై సీఎం తీవ్రంగా మండిపడ్డారు. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో పార్టీకి నష్టం కలుగుతోందని చంద్రబాబు అన్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ ప్రయోజనాల కోసం పాటు పడాలని చంద్రబాబు ఎమ్మెల్సీలకు సూచించారు. ఏ పదవి లేదని.. పార్టీకి ఉపయోగపడతారని ఎమ్మెల్సీ పదవులు ఇస్తే అడ్డంకులు సృష్టించడం ఏంటంటూ మండిపడ్డారు. ప్రజల నుంచి పది ఓట్లు వస్తాయని మీకు ఎమ్మెల్సీలు ఇచ్చానని.. కానీ మీ వల్ల పది ఓట్లు పోయే పరిస్దితి వచ్చిందని ఫైర్ అయ్యారు. అందరూ కలిసి ఎమ్మెల్యేలకు భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని సీఎం కోరారు. దీని ద్వారా ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు సులువవుతుందన్నారు. మళ్ళీ ఇలాంటి పరిణామాలు ఎదురైతే ఏ ఒక్కరినీ క్షమించేది లేదంటూ ఎమ్మెల్సీలకు చంద్రబాబు హెచ్చరికలు పంపారు.