తెలంగాణలో ప్రజా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు చేసుకుని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్టు నుంచే పవన్ తన ప్రజా యాత్ర మొదలుపెట్టడానికి ఒక కారణం ఉంది. 2009లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లిన పవన్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం హుస్నాబాద్ వెళ్లారు. అక్కడ ప్రచారం రథం ఎక్కి మాట్లాడుతుండగా బస్సు ముందుకు కదిలింది. ఆయన ముందున్న 11కేవీ విద్యుత్ లైన్ ఆయన తలకు తాకింది. అంతే ఆయన వాహనంలోనే ఒరిగిపోయారు. కాసేపటికే స్పృహతప్పారు.
దీంతో గాయపడ్డ పవన్కు సిబ్బంది సపర్యలు చేశారు. ఆ తర్వాత తేరుకున్నాక కొండగట్టు ఆంజనేయ స్వామిని తలుచుకుని యాత్రను తిరిగి ప్రారంభించారు. తనను ఆనాడు కాపాడింది కొండగట్టు అంజన్నే అని పవన్ గట్టిగా నమ్మరు. అప్పట్నుంచి ఇలవేల్పుగా భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన యాత్రా సంకాల్పానికి ఆంజన్న ఆశిస్సులు ఉండాలని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఆలయంలో పూజలు చేసిన పవన్.. బయటకు వస్తున్న క్రమంలో.. ఆయన అభిమానులు, కార్యకర్తలు జాతీయ జెండాలు ఊపారు.
ఈ క్రమంలో రెండు జాతీయ జెండాలు చిరిగిపోయినప్పటికీ కార్యకర్తలు పట్టించుకోలేదు. పవన్ కారుపైకి చేరుకోగానే.. అత్యుత్సాహంతో అభిమానులు.. ఆయనపైకి జాతీయ జెండాలను విసిరేశారు. దీంతో పవన్ బౌన్సర్లు.. జాతీయ జెండాలను ఇష్టారాజ్యంగా నలిపి పక్కకు పడేశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్.. మధ్యాహ్నం 2 గంటలకు కొండగట్టుకు చేరుకున్నారు. కాగా, అంజన్నకు ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అభివృద్ధికి రూ. 11 లక్షల చెక్కును అందజేశారు. మొదట రూ. 10 లక్షలు ఇవ్వబోయిన పవన్కు రూ. 11 లక్షలు ఇస్తే బాగుంటుందని ఈవో సూచించారు. దీంతో పవన్ రూ. 11 లక్షలు ఇచ్చారు.