కాంట్రాక్టర్లకు ఏపీ సర్కారు దాసోహం అంటోందనే విమర్శలకు మరింత బలం చేకూర్చే సంఘటన ఇది. ప్రాజెక్టులే పరమావధి అని చెబుతున్న టీడీపీ నాయకులు.. తమకు నచ్చిన వారికి ప్రాజెక్టు టెండర్లు కట్టబెట్టడం కోసం ఎంతకైనా తెగిస్తారనేందుకు నిదర్శనమిది. రాష్ట్రానికి ఆదాయం తగ్గినా ఫర్వాలేదు కానీ.. తమకు ఇష్టమైన, తాము మెచ్చిన సంస్థకు ప్రాజెక్టు దక్కించేందుకు ఏకంగా టెండర్ల ప్రక్రియనే రద్దుచేశారు ఏపీ సీఎం చంద్రబాబు! ఒకపక్క పోలవరం కాంట్రాక్టర్ విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం.. ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ దక్కించుకున్న ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసి ప్రైవేటు కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చేందుకు కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది!!
అవినీతి జరిగితే సహించను, ప్రాజెక్టుల విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించను అని ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే చెబుతూ ఉంటారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడబోమని కూడా స్పష్టం చేస్తుంటారు. కానీ భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఏపీలో ఉన్న విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తే అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెరిగి అభివృద్ధి పరుగులు పెడుతుందని అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో భోగాపురం ఎయిర్పోర్టును గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంగా మార్చేందుకు ఏపీ సర్కారు తొలుతు టెండర్లు పిలిచింది.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును టీడీపీ సీనియర్ నేత, పౌర విమానయానశాఖమంత్రి అశోక్ గజపతిరాజు శాఖప్రాతినిధ్యం వహిస్తున్న శాఖకు చెందిన ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దక్కించుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ ఏఏఐకి ప్రాజెక్టు అప్పగించి..వేగంగా పనులు పూర్తి చేయించాల్సిన సర్కారు ప్రభుత్వ రంగ సంస్థ దక్కించుకున్న టెండర్ ను రద్దు చేయాలని కేబినెట్లో నిర్ణయించడంపై అందరిలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తాను కోరుకున్నట్లు జీఎంఆర్ సంస్థకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు దక్కకపోవటంతో ఏకంగా ఆ టెండర్ నే రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించడంపై అందరిలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జీఎంఆర్ కంటే ఏఏఐ ఏపీ ప్రభుత్వానికి ఇస్తానన్న ఆఫర్ చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాజెక్టు దక్కించుకున్న ఏఏఐ 31 శాతం రెవెన్యూ ఇస్తానని ప్రకటించగా…చంద్రబాబు ప్రాజెక్టు ఇవ్వాలని అనుకున్న జీఎంఆర్ 21.6 శాతం మాత్రమే ఆఫర్ చేసింది. చంద్రబాబు అప్పటినుంచో ఏఏఐని ఎలా తప్పించాలని చూసి.. ఇప్పుడు కొత్తగా అదనపు కాంపొ నెంట్స్ చేర్చి టెండర్ పిలవాలని నిర్ణయించటం వెనక ఏదో మతలబు దాగి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏఏఐ నుంచి కమీషన్ల రూపంలో రూపాయి కూడా రాదు. అదే ప్రైవేట్ సంస్థలు అయితే భారీ ఎత్తున ముట్టచెబుతాయని, ఇదే టెండర్ల రద్దు వెనుక అసలు కథ అని చెబుతున్నారు. మరి ఇప్పుడు కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే!