ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. సాధారణంగా ఇటీవల కాలంలో బాబు తీసుకున్న నిర్ణయాలు ఏవీ కూడా వివాదాస్పదం కాలేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఆయన మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం వివాదాలకు దారితీసింది. విషయంలోకి వెళ్తే.. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం టెండర్ దక్కించుకున్న ‘ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం విపక్షాలకు చక్కని అవకాశంగా మారింది. ఏఏఐ దక్కించుకున్న భోగాపురం టెండర్ను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఉన్నతాధికారుల నుంచి విపక్షాల్లోని నేతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రూ.వేల కోట్ల పనులకు చెందిన టెండర్ల విషయంలో స్వయంగా సీఎం జోక్యం చేసుకోవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు. బాబు తనకు ఇష్టమైన వారికి, కావాల్సిన వారికి అనుగుణంగా నిబంధనలను రూపొందించాలని ఆదేశించడం, లేదంటే నామినేషన్, కొటేషన్లపై పనులు అప్పగించడం వంటివి చూసి అధికార యంత్రాంగం విస్తుపోతోంది. ఇపుడు ఏకంగా ఓ ప్రభుత్వ సంస్థ దక్కించుకున్న టెండర్ను చంద్రబాబు రద్దు చేయడం చూసి రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోందనే చర్చ నడుస్తోంది. ఏఏఐ సంస్థ నుంచి ముడుపులు రావన్న ఉద్దేశంతోనే అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్ను రద్దు చేశారని విమర్శలు వస్తున్నాయి.
ప్రైవేట్ సంస్థకు ఈ టెండర్ ఇస్తే ముఖ్య నేతకు ఆర్థికంగా భారీ ప్రయోజనం కలుగుతుందని, అందుకే అన్ని అర్హతలతో టెండర్ దక్కించుకున్న ఏఏఐకి కాంట్రాక్టు దక్కకుండా ఏకంగా టెండర్నే రద్దు చేశారని ఉన్నతస్థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సింగిల్ టెండర్ మాత్రమే దాఖలైనా భావనపాడు పోర్టును అయిన వారికి అప్పగించేసిన సీఎం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్లలో జీఎంఆర్, ఏఏఐలు పాల్గొనగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా రెవెన్యూ వాటా ఇస్తానన్న ఏఏఐకి టెండర్ ఇవ్వకుండా ఎందుకు రద్దు చేశారో చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు.
మొత్తానికి ఈ టెండర్ రద్దు వ్యవహారం రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. సొంత పార్టీ ఎంపీ, కేంద్రం మంత్రి అశోక్ గజపతి రాజు శాఖగా ఉన్న ఏఏఐని చంద్రబాబు పక్కన పెట్టడం నిజానికి బాబు తీసుకున్న సంచలన నిర్ణయంగానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు