భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ)గా ఓం ప్రకాష్ రావత్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు సీఈసీగా ఉన్న అచల్ కుమార్ జ్యోతి పదవీకాలం సోమవారంతో ముగిసింది. ఆయన స్థానంలో ఓం ప్రకాశ్ రావత్ బాధ్యతలు చేపట్టారు. 1977 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన రావత్ 2015 ఆగష్టులో ఎలక్షన్ కమిషనర్గా నియమితులయ్యారు. వచ్చే ఏడాది నవంబర్ వరకు ఆయన సీఈసీగా కొనసాగుతారని న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్ మాజీ ఐఏఎస్ కేడర్ కు చెందిన రావత్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో సేవలు అందించారు.
2004 నుంచి 2006 మధ్య అప్పటి మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి బాబు లాల్ గౌర్కు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఓపీ రావత్ పనిచేశారు. అడవుల హక్కులకు సంబంధించి ఆయన తీసుకున్న చొరవకు గాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆయనకు 2010లో ప్రైమ్ మినిస్టర్ అవార్డు దక్కింది. కాగా, భారత ఎన్నికల సంఘంలో ముగ్గురు సభ్యులు ఉంటారు.ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా, మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు.
ఈ ఇద్దరిలో సీనియార్టీ ప్రాతిపదికన ఒకరిని సీఈసీగా రాష్ట్రపతి నియమిస్తారు. ఇప్పటి వరకూ ఏకే జ్యోతి సీఈసీగా.. ఓం ప్రకాశ్ రావత్, సునీల్ అరోరా ఎన్నికల కమిషనర్లుగా ఉన్నారు. ఏకే జ్యోతి పదవీ కాలం ముగియడంతో సీనియర్ అయిన ఓం ప్రకాశ్ రావత్కు సీఈసీగా అవకాశం లభించింది. ఐక్యరాజ్య సమితి ఎన్నికల అబ్జర్వర్గా ఆయన సౌత్ ఆఫ్రికాకు వెళ్లారు. 1994లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన వర్ణ వివక్ష కారణంగా వచ్చిన ఎన్నికల సమయంలో ఆయన అక్కడ పనిచేశారు.