ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘోర అవమానం జరిగింది. ముస్లిం మతానికి చెందిన పురుషులను శిక్షించే వ్యూహంలో భాగంగానే ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. ముస్లిం మహిళలను రోడ్లెక్కించాలని, పురుషులను మాత్రం జైలుకు పంపాలనే కుట్రతోనే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని అన్నారు. దక్షిణ ముంబైలోని నాగ్పదలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఒవైసీపై బూటు విసిరాడు. కాకపోతే అది ఒవైసీకి తగల్లేదు.
ఈ ఘటనతో ఏమాత్రం బెదరని ఒవైసీ తన ప్రసంగాన్ని యథాతథంగా కొనసాగించారు. రాత్రి 9.45 గంటల సమయంలో ట్రిపుల్ తలాక్ గురించి ఒవైసీ ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పద్మావత్ సినిమా వివాదం పరిష్కారానికి ఓ కమిటీని ఏర్పాటుచేశారు కానీ, ట్రిపుల్ తలాక్ బిల్ల విషయంలో మాత్రం ఎలాంటి కమిటీని వేయలేదని చెప్పారు.
'ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా చేసిన కుట్రే ట్రిపుల్ తలాక్ బిల్లు.ఇది ఒక వ్యూహం మాత్రమే' అని ఆయన అన్నారు. మరోపక్క, ఎవరైతే, తలాక్ ద్వారా విడాకులు కోరుకుంటారో వారిని సామాజిక బహిష్కరణ చేయాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో ముస్లిం మహిళల అభివృద్ధికి రూ.2వేల కోట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడం కోసం అవసరమైతే ప్రాణాలను సైతం ఫణంగా పెడతానని చెప్పారు. మహాత్మాగాంధీ, నరేంద్ర దభోల్కర్, గోవిండ్ పన్సారేలను చంపిన హంతకుల భావజాలాన్నే తనపై బూటు దాడి చేసిన వారు కూడా అనుసరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.