ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు రోడ్డు ప్రమాదాల భారిన పడుతున్నారు. ఆ మద్య దేవినేని, మంత్రి జవాహార్..తాజాగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి లకు రోడ్డు ప్రమాదాలు జరిగాయి..అదృష్టం కొద్ది ఈ ప్రమాదాల నుంచి వారు తృటిలో తప్పించుకున్నారు. నగర పరిధిలోని ఇందిరానగర్ వద్ద జాతీయ రహదారిపై సుజనా కాన్వాయ్ లోకి గుర్తు తెలియని రెండు కార్లు ఆకస్మికంగా వచ్చాయి.
కాన్వాయ్ నుంచి వేరు చేసేందుకు ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో, దాని వెనుకే వస్తున్న సుజనా కారు బలంగా ఢీకొంది. ఆ సమయంలో మంత్రి ముందు సీట్లో సీట్ బెల్టు పెట్టుకుని కూర్చుని ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.అదే వాహనంలోనే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంతో ఇద్దరూ క్షేమంగా బయటపడటంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుజనా చౌదరి ఎయిర్పోర్టు నుంచి వెళ్తుండగా మర్రిపాలెం వాటర్ ట్యాంక్ సమీపంలో ఘటన జరిగింది. ఘటన అనంతరం కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ అవంతీ శ్రీనివాస్ను వేరే కారులో తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మంత్రి కాన్వాయ్లోకి వచ్చిన కార్లు ఎవరివి, ఎందుకు వచ్చారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.