రాజకీయాల్లో ఉన్నవారు మాటపై నిలబడరనే పేరుంది. ఇదేం కొత్తకాదు. ఎన్నికల సమయంలో అనేక హామీలు గుప్పిస్తుంటారు.. వాటన్నింటినీ అమలు చేయడం అంటే మాటలు కాదు.. డబ్బుల మూటలు ఉండాలి కాబట్టి వాటిని తర్వత కాలంలో మరిచిపోవడం నేతలకు మామూలే. ఈ విషయంలోనూ ప్రధాన హామీలపైనే ప్రజలు ప్రశ్నిస్తారు తప్ప.. చిన్న చిన్న హామీల జోలికి పోరు. అయితే, ఇప్పుడు మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. అనూహ్యంగా టంగ్ స్లిప్పయి.. వివాదంలో చిక్కుకున్నారు. అంతేకాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధం తీవ్ర రూపం దాలిస్తే.. ఆయనకు రాజకీయంగా కూడా తీవ్ర ఇబ్బందికర పరిణామాలు తప్పేలా కనిపించడం లేదని అంటున్నారు విశ్లేషకులు. ఇక, రాజకీయాల్లో ఉన్నవారు.. ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో కూడా ఈ వ్యాఖ్యలు ఉదాహరణ అని వివరిస్తున్నారు.
విషయంలోకి వెళ్తే.. ఏపీకి ప్రత్యేక హోదా అనేది బ్రహ్మ పదార్ధంగా మారిపోయింది. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో దీనిని విభజన చట్టంలో చేర్చలేదు. అయితే, అప్పటి విపక్ష నేత, రాజ్యసభ ఎంపీగా ఉన్న వెంక్యయ్యనాయుడు హోదా విషయాన్ని లేవనెత్తడంతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలోనే ఏపీకి ఐదేళ్ల హోదా ఇస్తామంంటూ ప్రకటించారు. అయితే, అప్పటికే కొన్ని కారణాల వల్ల ఆయన దీనికి సంబంధించి విభజన చట్టంలో చేర్చే అవకాశం లేకుండా పోయిందని కూడా వివరణ ఇచ్చుకున్నారు. ఇక, ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఉంటేనే ప్రత్యేక హోదాతో ఏపీ గట్టున పడుతుందని వెంకయ్య వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిని 2014 ఎన్నికల్లో ఏపీలో మిత్రపక్షంగా బరిలోకిదిగిన టీడీపీ-బీజేపీలు కూడా ప్రచారం చేసుకున్నాయి. అయితే అనూహ్యంగా ఈ హోదాపై రాజకీయ రంగు పులుముకుంది. దీనిని ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం అడ్డు పడుతోందని పేర్కొంటూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తేల్చి చెప్పి.. ఏపీకీ ప్యాకేజీని ప్రకటించింది.
ఇక, అప్పటి మిత్రధర్మం నేపథ్యంలో అప్పటి వరకు హోదా వస్తేనే ఏపీ బాగుపడుతుందని, పరిశ్రమలు వస్తాయని, ఉపాధి ఉంటుందని తెగ ప్రకటనలు చేసిన సీఎం చంద్రబాబు నెమ్మది నెమ్మదిగా తన టోన్ను ష్టోన్ చేసుకున్నారు. హోదా ఏమన్నా సంజీవనా? అని ప్రశ్నించి అవాక్కయ్యేలా చేశారు. ప్యాకేజీ పరమాద్భుతం అన్నారు. ప్యాకేజీ తీసుకుంటూనే ఏపీకి రావాల్సిన అన్ని విషయాల్లోనూ నొప్పి తెలియకుండా కేంద్రాన్ని చాచి కొడతామని ప్రకటించారు. దీంతో ప్రజలు ప్యాకేజీకి మైండ్ సెట్ చేసుకుంటున్న తరుణంలో వైసీపీ అధినేత జగన్ సహా జనసేనాని, బాబుకు మిత్రుడు పవన్లు హోదా కోసం గళం విప్పారు. దీంతో మళ్లీ హోదా రగడ పెరిగింది. ఇటవల కాలంలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్.. ఏకంగా హోదాను అడ్డు పెట్టి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. హోదా ఇస్తానంటే బీజేపీతో జట్టుకు రెడీ అన్నారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి.
ఇక, ఈ క్రమంలోనే స్పందించిన చంద్రబాబు.. అనూహ్యమైన ప్రకటన చేశారు. మిత్ర ధర్మాన్ని పాటిస్తూ.. ఇన్నాళ్లు కేంద్రం వద్ద చేతులు కట్టుకున్నామని, ఇకపై ఏపీకి రావాల్సిన హోదా సహా నిధుల విషయంపై సుప్రీం కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. ఆలస్యంగా అయినా ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీతో వచ్చే ఎన్నికల్లో ఎలాగూ పొత్తు తెగతెంపులు చేసుకునేందుకు రెడీ అవుతున్న చంద్రబాబు.. మళ్లీ హోదా గళం విప్పారని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇన్నాళ్లూ దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎలా సంజీవని అవుతుందని ప్రశ్నించారు? అని అడుగుతున్నారు. బాబు రెండు నాలుకల ధోరణి బాగోలేదని కామెంట్లు చేస్తున్నవారు సైతం పెరుగుతున్నారు. బీజేపీ.. వైసీపీతో పొత్తు పెట్టుకుంటోదని తెలిసిన తక్షణమే బాబు టోన్ మారిందని పెద్ద ఎత్తున విమర్శలు సంధిస్తున్నారు. మరి బాబు దీనికి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.