భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత సోమవారం పార్లమెంట్ ముందుంచిన ఆర్థిక సర్వే-2018 ప్రకారం రాష్ట్రాల అంతర్జాతీయ ఎగుమతులకు సంబంధించి ఈ సర్వేలో అత్యంత ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశ ఎగుమతుల్లో కేవలం "ఐదు రాష్ట్రాల వాటానే 70 శాతం" గా ఉందని అవే ధనిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు లదే ఎగుమతుల్లో సింహ భాగమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. దేశ చరిత్ర లోనే ఇలా జరగడం తొలిసారి కావడం గమనార్హం.
అయితే భారత జీడీపీలో అంతర్రాష్ట్ర సరకుల రవాణా 30నుంచి50 శాతం మధ్య ఉండొచ్చని గత ఏడాది ఆర్థిక సర్వేలో వెల్లడైంది తెలిసిందే. కానీ ఇది మన జీడీపీలో 60శాతానికి పైగా ఉంటుందని జీడీపీ డేటా సూచిస్తోంది. జీఎస్టీ పరిధిలోకి రాని వస్తువులు, సేవలను ఇందులో పరిగణనలోకి తీసుకోలేదు.
ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎగుమతుల విషయంలో సంపూర్ణ వైవిధ్యం కనిపిస్తోంది. మిగతా దేశాల ఎగుమతుల్లో భారీ సంస్థల వాటా ఎక్కువగా ఉండగా, మన దగ్గర అది తక్కువగా ఉంది. టాప్-1 భారతీయ సంస్థల వాటా 38శాతం మాత్రమే ఉంది. బ్రెజిల్లో ఇది 72శాతం ఉండగా, జర్మనీలో 68శాతం, మెక్సికోలో 67శాతం, అమెరికాలో 55శాతంగా ఉంది. వాణిజ్య సేవల విషయంలో 2016 లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్రపంచ వాణిజ్య సేవల్లో భారత్ వాటా 3.4శాతంగా ఉంది.
ఈసారి బడ్జెట్ గురించి ఆర్ధిక సర్వే ఏం చెపుతుంది?
ఈసారి బడ్జెట్లో జనాకర్షక పథకాలకు పెద్దగా అవకాశం ఉండదని, ఉపాధి, పెట్టుబడుల ప్రవాహం పెంచే సంస్కరణలకే పెద్దపీట వేస్తారని గత సోమవారం ప్రకటించిన ఆర్థిక సర్వే 2017-18 సంకేతాలు ఇస్తుంది. ఉపాధి రంగాలైన టెక్స్టైల్స్, లెదర్, అపెరల్స్, జెమ్స్, జ్యూయలరీ వంటి శ్రామికశక్తి అధికంగా ఉన్న రంగాలకు బడ్జెట్లో ప్రోత్సాహకాలు ఉంటాయని భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈసారి బడ్జెట్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచి, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు వృద్ధి చెందే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉపాధి, విద్య, వ్యవసాయ రంగాలకు భారీగా ఊతమివ్వాలని ఆర్థిక సర్వే స్పష్టం చేసిన క్రమంలో బడ్జెట్లో ఈ రంగాలకు ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉంది.
యువత, మహిళలతో పాటు శ్రామిక శక్తికి మెరుగైన ఉద్యోగాలను అందుబాటులోకి తేవడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ద్వారా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం తక్షణ ప్రాధాన్యతగల అంశంగా ఆర్థిక సర్వే అజెండాలో పేర్కొనడంతో బడ్జెట్లో ఈ దిశగా చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. వీటికి తోడు ప్రయివేటు పెట్టుబడులు, ఎగుమతులపై ఆర్థిక వృద్ధి వేగాన్ని నిలకడగా కొనసాగించడం కీలకమని సర్వే చాటింది. వర్షపాత లేమితో పలు ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకత పడిపోవడంపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసిన క్రమం లో రానున్న బడ్జెట్లో ఇరిగేషన్కు నిధుల కేటాయింపు పెరిగే అవకాశం ఉంది.
జీడీపీ వృద్ధి
జీడీపీ వృద్ధి కోసం గత ఏడాది కాలం నుంచి అనేక సంస్కరణలు చేపట్టామని జైట్లీ తెలిపారు. 2017-18లో వృద్ధి రేటు 6.75 శాతంగా నమోదైనట్లు తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.0 నుంచి 7.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. ఉపాధి, విద్య, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. త్రైమాసిక వృద్ధిరేటును పరిశీలిస్తే వార్షిక వృద్ధిరేటు మందగిస్తున్నట్లు కనిపించిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) కొత్త ఊపునిచ్చిందన్నారు. జీఎస్టీ అమలు తర్వాత పారిశ్రామిక వృద్ధిరేటులో కొంత మందగమనం ఉందన్నారు.