2019 ఎన్నికలే లక్ష్యంగా తెలుగు రాష్ర్టాల్లో పార్టీ ప్రక్షాళనకు బీజేపీ నాయకత్వం సిద్ధమైంది. రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల సమావేశమే ఇందుకు వేదిక కాబోతోంది. వచ్చే ఎన్నికల నేపథ్యంలో అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైనదిగా ఈ సమావేశం ఉండబోతోంది. ఈ మేరకు సంకేతాలిచ్చిన బీజేపీ అధిష్టానం.. అత్యంత కీలకమైన ముఖ్యనేతలకే ఆహ్వానాలు పంపి.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బడ్జెట్ హడావిడి ఉన్నప్పటికీ పార్టీ ప్రక్షాళన తప్పదని భావించిన అమిత్ షా అత్యవసర సమావేశానికి ఏర్పాటు చేయడం విశేషం.
2019 ఎన్నికల నాటికి రెండు తెలుగురాష్ర్టాల్లోనూ పార్టీని బలోపేతం చేసేందుకు అమిత్ షా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆర్ఎస్ ఎస్ సర్వే, పార్టీ సర్వే నివేదికలను తెప్పించుకున్న అమిత్ షా ఆయా రాష్ర్టాల బీజేపీ అధ్యక్షుల సమావేశంలో కీలక రాజకీయ నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానంగా తెలంగాణతో పాటు, ఏపీలో క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టిన RSS బృందం.. వీలైనంత త్వరగా కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించింది. ఈ మేరకు అధిష్టానానికి నివేదించిన ప్రతినిధులు.. ఈ నిర్ణయాలు ఆలస్యమైతే రెండు తెలుగురాష్ర్టాల్లో బీజేపీ ఉనికికే ప్రమాదమనే సంకేతాలిచ్చారు. దీంతో ఓ వైపు పార్టీ పెద్దలంతా బడ్జెట్ హడావిడిలో ఉన్నప్పటికీ అమిత్ షా మాత్రం బీజేపీ రాష్ర్ట అధ్యక్షుల సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ నుంచి ముఖ్యమైన నేతలనే వ్యూహాత్మకంగా ఆహ్వానించారు.
తెలంగాణ నుంచి పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, దత్తాత్రేయ, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ వంటి కీలక నేతలనే ఆహ్వానించారు. అటు ఏపీ నుంచి పార్టీ అధ్యక్షుడు హరిబాబు, సోమూవీర్రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవీంద్రరాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, విష్ణుకుమార్ రాజులను ఆహ్వానించారు. ఈ సమావేశానికి మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావును పిలవలేదు. దీన్నిబట్టి ఈ సమావేశం బీజేపీ పార్టీ అంతర్గతంగా జరుగుతున్న అత్యంత కీలకమైన సమావేశంగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు.
తెలంగాణలో ప్రధానంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన చింతల రామచంద్రారెడ్డి, కిషన్ రెడ్డిల్లో ఎవరో ఒకరిని అధ్యక్షుడిగా నియమిస్తారనే సంకేతాలు అందుతున్నాయి. అలాగే బీసీల్లో పట్టున్న ఆలె నరేంద్ర కుమారుడు అలె శ్యాంకు పార్టీలో కీలక పదవి ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఇవేకాక పార్టీలో సామాజికవర్గాలు, ప్రాంతాల ప్రాదిపదికన మరికొన్ని మార్పులు చేయాలని భావిస్తున్న అమిత్ షా.. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు, బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్ కు పొసగడం లేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధ్యక్ష పదవిలో మార్పులకు సిద్ధమౌతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీపై ప్రత్యేక పోకస్ పెట్టిన అమిత్ షా.. RSS నివేదికతో పాటు .. ఆంధ్రప్రదేశ్ సామాజిక పరిస్థితుల దృష్ట్యా పార్టీ అధ్యక్ష పదవితో పాటు.. కీలక పదవుల్లోనూ మార్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు హరిబాబు స్థానంలో కన్నా లక్ష్మీనారాయణను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు కాషాయదళం చర్చించుకుంటోంది. కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలు అప్పగించి.. కమ్మ సామాజికవర్గానికి చెందిన పురంధేశ్వరికి రాజ్యసభ కేటాయించి.. కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదన బీజేపీ నాయకత్వం దగ్గర ఉంది. తద్వారా రెండు బలమైన సామాజికవర్గాలను ఆకర్షించాలని చూస్తోంది బీజేపీ. అంతేకాదు ప్రధానంగా రాయలసీమలో బీజేపీని విస్తృతం చేయాలని ప్రతిపాదనలు కూడా బీజేపీ నాయకత్వం దగ్గరున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాయలసీమ నిరాదరణకు గురైందని గతంలోనే బీజేపీ సీమ నేతలంతా కేంద్రాన్ని కలిసారు. ఈ నేపథ్యంలో తెలుగురాష్ర్టాల బీజేపీ అధ్యక్షుల సమావేశంలో అమిత్ షా కీలకమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలోనే రాష్ర్టాల బీజేపీ అధ్యక్షుల మార్పులు.. పార్టీ పదవులపై నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. ఫిబ్రవరి మూడు లేదా నాలుగో వారంలో అధికారికంగా ప్రకటించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.