నరేంద్రమోడీ చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ను ఉస్సూరనిపించింది. రాజధాని నిర్మాణం, పోలవరం కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నా అరుణ్ జైట్లీ అంతగా కరుణించలేదు. బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు చూస్తే నిరాశ కలుగకమానదు. ఆ వివరాలు చూద్దాం.. ఏపీలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు కేటాయించడం జరిగింది. గిరిజన విశ్వవిద్యాలయానికి మరో 10 కోట్లు ఇచ్చారు.
ఏపీలో ఎన్ఐటీకి రూ.54 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ లో ఐఐటీకి రూ.50కోట్లు ఇచ్చారు. అలాగే ఏపీలో ట్రిపుల్ ఐటీ కోసం రూ.30 కోట్లు ఇచ్చారు. ఏపీలో ఐఐఎంకు రూ.42 కోట్లు
బడ్జెట్ లో కేటాయించారు. ఐఐఎస్సీఆర్కు రూ.49 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ.32 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది.
విశాఖలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్కు రూ.19.62 కోట్లు కేటాయించడం జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని ఎయిమ్స్లకు రూ.3,018 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. అలాగే ఏపీ, తెలంగాణాకు 50 కోట్లు చొప్పున ఇంట్రెస్ట్ సబ్సిడీ ఫర్ ఇండస్ట్రియల్ యూనిట్స్ కింద అందజేయడం జరిగింది. మొత్తం మీద ఏపీకి ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ కలిగించింది. దీనిపై స్పందించిన ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు.. 2014-15 రెవెన్యూ లోటులో రావాల్సిన ఏడువేల కోట్లు రావాల్సి వుండగా అందులో ఇప్పటివరకూ నాలుగువేల కొట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు.
ఏపీకి ఇంకా మిగిలిన మూడువేల కోట్లు ఇవ్వాలని కోరామని.. తాము అన్ని విభాగాలకు సంబంధించి వేల కోట్లలోనే ప్రతిపాదనలు పంపామని గుర్తు చేశారు. ఏపీకి సంబంధించిన అంశాలను బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ, విజయవాడ మెట్రోల గురించి బడ్జెట్లో ఉందో లేదో బడ్జెట్టును పూర్తిగా పరిశీలిస్తే కానీ చెప్పలేమని యనమల అన్నారు. బడ్జెట్టును ఇంకా పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు యనమల.