అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరిక అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ ల మధ్య అఘాదం మరింత ముదురుతోంది. న్యాయ విభాగంతో రహస్య మైత్రితో కుమ్మక్కై ఎఫ్బీఐ అధికార దుర్వినియోగానికి సిద్ధమౌతుందని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల తరవాత ప్రతిదాడి తీవ్రమైంది. ఎఫ్బీఐ, దర్యాప్తు సంస్థల ప్రతినిధులతో పాటు డెమోక్రాట్లు కూడా డొనాల్డ్ ట్రంప్ ఆయన బృందంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతోన్న దర్యాప్తులో డెమోక్రాట్లతో ఎఫ్బీఐ, న్యాయ విభాగం కుమ్మక్కయ్యా యని ఆరోపిస్తూ డొనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్లు ఎఫ్బీఐపై రహస్య మెమో విడుదల చేశారు. ఎఫ్బీఐ వద్దని వారిస్తోన్నా వినకుండా ట్రంప్ ఈ మెమో ను ఆమోదించి "హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ" లకు పంపారు. మెమోరాండంలో వెల్లడైన వివరాలు సిగ్గుచేట ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రచార సలహాదారుగా పనిచేసిన కేటెర్ పేజ్ పై రష్యా ఏజెంట్ గా ముద్రవేసి అక్రమంగా నిఘా పెట్టారని దీనిలో సంచలన వ్యాఖ్యలుచేశారు. ఈ విషయంపై వైట్ హౌజ్ ప్రెస్ సెక్రెటరీ సారా శాండర్స్ ఒక ప్రకటన విడుదలచేశారు.
న్యాయవిభాగం, ఎఫ్బీఐ లలోని ఉన్నత అధికారులు తీసుకున్న నిర్ణయం వెనకున్న ఉద్దేశం, నిజాయితీ పై తీవ్ర ఆందోళన లు వినిపిస్తున్నాయి. "రిపబ్లికన్ల రహస్య మెమో" వీటిని ప్రధానంగా ఎత్తి చూపుతోంది. కేవలం విపక్షాల ఆరోపణల పత్రం ఆధా రంగా కేటెర్ పేజ్ పై దర్యాప్తు మొదలుపెట్టారు. ఆయనపై డొనాల్డ్ ట్రంప్ కు ఎంతో నమ్మక ముంది. అమెరికా భద్రత, చట్టాల పరిరక్షణ, పౌరుల రాజ్యాంగ బద్ధ హక్కులు కాపాడేందుకు కేటెర్ పేజ్ ఎంతో శ్రమిస్తారు" అని సారా శాండర్స్ చెప్పారు.
మరోవైపు ట్రంప్ బృందం ఆరోపణలు, వారి చర్చల గురించి ఎలాంటి ఆందోళనా వద్దని అధికారులు, ఉద్యోగులకు ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే, ఒక లేఖ, వీడియో సందేశం పంపారు. "అమెరికా ప్రజలు వార్తా పత్రికలు చదువుతారు. టీవీల్లో వచ్చే చర్చలూ చూస్తారు. జాతి భద్రతకు మీరు చేస్తున్న కృషి వారికి తెలుసు. ఊరికే మాట్లాడటం వారి స్థాయి ని దిగజార్చుకోవడమే తప్ప, మీరుచేసే కృషికి ఎప్పుడూ విలువ ఉంటుంది" అని వీడియోలో క్రిస్టోఫర్ రే వ్యాఖ్యానించారు.
"రష్యా జోక్యం" అనే విషయం విచారణ చేపడుతున్న అధికారులతోపాటు డిప్యూటీ అటార్నీ జనరల్ రోడ్ జే రీసెన్ స్టెయిన్ పైనా డొనాల్డ్ ట్రంప్ వేటువేసే అవకాశముందని వార్తలు వినిపించాయి. ఇలాంటి చర్యలతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ముప్పుం దని డెమోక్రాట్లు హెచ్చరించారు.
రిపబ్లికన్ సభ్యుడు డానా రోహ్రబచెర్ మాట్లాడుతూ, "రహస్య మెమోతో వాస్తవాలు వెలుగుచూశాయని పోలీసు, నిఘా విభాగాలు కూడా కొన్నిసార్లు రాజీపడతాయి. అలాంటి దుర్వినియోగం విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అందుకే అన్ని ఫెడరల్ దర్యాప్తు విభాగాలపై అమెరికన్ చట్టసభల పర్యవేక్షణ పరిశీలన ఉండాలి" అని అన్నారు. పారదర్శకత కోసం డొనాల్డ్ ట్రంప్ శ్రమిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
"ఎఫ్బీఐ విచారణకు డెమోక్రాట్లు సాయపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నమే ఇది. ఇది వాటర్ గేట్ కుంభకోణంతో పోల్చదగిన స్థాయిలో ఉంది’ అని అన్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్బీఐ మాత్రం నోరు మెదపలేదు.
ఎఫ్బీఐపై ఆరోపణలు గుప్పిస్తూ రిపబ్లికన్లు విడుదలచేసిన మెమోను భారతీయ అమెరికన్ న్యాయవాది "కశ్యప్ కేశ్ పటేల్" తయారు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి సంబంధించిన నిఘా వ్యవహారాలు పర్య వేక్షించే సభాసంఘానికి సీనియర్ న్యాయవాదిగా ఈయన పనిచేస్తున్నారు. ఈ కమిటీకి డేవిన్ న్యూన్స్ అధినేతృత్వం వహించారు. అయితే మోమోను పటేల్ ఒక్కరే తయారు చేశారన్న వార్తలను డేవిన్ న్యూన్స్ కార్యాలయం తోసిపుచ్చింది. అది బృంద సమిష్టి కృషి మాత్రమేనని బృందానికి పటేల్ విలువైన సేవలు అందించారని పేర్కొంది. మరోవైపు మీడియాలో వచ్చిన వార్తల్లో నిజంలేదని కశ్యప్ కేశ్ పటేల్ కూడా తెలిపారు.
ప్రతినిధుల సభకు చెందిన ఇంటెలిజెన్స్ చైర్మన్ డెవిన్ న్యూన్స్ ఆద్వర్యంలో రూపొందించిన ఈ రహస్య మెమోలో, "డెమోక్రాట్ల తరఫున బ్రిటిష్ నిఘా ప్రతినిధి క్రిస్టోఫర్ స్టీల్ రాసిన పరిశోధన వివరాల్ని దర్యాప్తులో ఎఫ్బీఐ వాడుకుంది" అని ఆరోపించారు.