ఏపీ సీఎం చంద్రబాబు కొత్త ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. ఇప్పటికే ఆయన ఆపరేషన్ ఆకర్ష్ను రెండు మూడు విడతల్లో ప్రమోగించి విపక్ష వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను టీడీపీలోకి జాయిన్ చేసేసుకున్నారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలకు ఏకంగా మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇక కొద్ది రోజుల వరకు విడతల వారీగా ఆపరేషన్ ఆకర్ష్లతో ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు 23 మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు.
ఇక ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపారు. ఈ సారి ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపడం వెనక బిగ్ ప్లానే ఉంది. ఏపీలో వచ్చే నెలలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాను బట్టి చూస్తే అధికార టీడీపీకి రెండు సీట్లు దక్కడం గ్యారెంటీ. ఇక మూడో సీటుపై కూడా కన్నేసిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి ఆపరేషన్కు తెరలేపారు. మరో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కూడా పసుపు కండువా కప్పేసుకుంటే టీడీపీకి మూడో రాజ్యసభ సీటు కూడా వచ్చేస్తుంది.
ఈ క్రమంలోనే చంద్రబాబు తాజా ఆపరేషన్ ఆకర్ష్లో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫాను వల్లో వేసుకున్నారు. నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు శిష్యుడు అయిన ముస్తఫాను టీడీపీలోకి తీసుకు వచ్చేందుకు రాయపాటి చాలా రోజులుగా మంత్రాంగం చేస్తున్నారు. చివరకు రాయపాటి వచ్చే ఎన్నికల్లో సీటుపై ఆయనకు చంద్రబాబు ద్వారా హామీ ఇప్పించడంతో ముస్తఫా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
ఇక ఈ లిస్టులో నెక్ట్స్ కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన గతంలో టీడీపీలో పనిచేశారు. అలాగే అదే జిల్లా తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధిపై కూడా టీడీపీ వల వేసినట్టు తెలుస్తోంది. పార్టీ మారే ఎమ్మెల్యేలు ముందుగా చంద్రబాబును కలవడం పార్టీ మారడం లేదని చెపుతూనే నెమ్మదిగా రాజ్యసభ ఎన్నికలకు ముందు వరుసగా కండువాలు మార్చే కార్యక్రమం కూడా రెడీ అవుతోందట. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో మరో ఇద్దరు ముగ్గురు పార్టీ మారిపోతే జగన్కు ఆ ఒక్క రాజ్యసభ సీటు కూడా దక్కడం కష్టమే.