ఖమ్మంలో అధికార టీఆర్ఎస్ పార్టీ కి చెక్ పెట్టాలని ఓ వైపు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న వేళ ఆ పార్టీ కీలక నేత, ఎంపీ రేణుకాచౌదరి ట్విస్ట్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన రేణుకాచౌదరిని బరిలో దింపి టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ని ఓడించాలన్న వ్యూహంతో కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఖమ్మం మాజీ ఎంపీ టీడీపీ లీడర్ నామా నాగేశ్వరరావును కాంగ్రెస్లో చేర్చుకుని ఆయన్ను ఖమ్మం ఎంపీగా పోటీ చేయించాలని ప్రయత్నాలు చేశారు.
అయితే ఈ విషయంలో ముందుగా కొంత సుముఖంగా ఉన్న రేణుకాచౌదరి ఆ తర్వాత మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆమె ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలని అనుకున్న ఆమె ఇప్పుడు మనసు మార్చుకోవడంతో ఎవరిని బరిలో దించాలో అర్థం కాక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా వుండగా ... ఇన్ని రోజులూ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అనుకున్న టీడీపీ నేత నామా నాగేశ్వరరావు కూడా తాను ఏ పార్టీ లోనూ చేరనని, టీడీపీ లోనే కొనసాగుతానని ప్రకటించారు. నామా నాగేశ్వరరావు ప్రకటన కాంగ్రెస్ పార్టీకి మరింత షాక్ ఇచ్చింది.
రేణుక నుంచి తన కాంగ్రెస్ ఎంట్రీకి అడ్డంకులు ఉండడంతో నామా కూడా తనంతట తానుగా కాంగ్రెస్లోకి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. తనంతట తానుగా కాంగ్రెస్లోకి వెళ్లడం కన్నా అటు వైపు నుంచి ఆఫర్ ఉన్నప్పుడు వెళితేనే బెట్టుగా ఉంటుందని నామా ప్లాన్గా తెలుస్తోంది. రేణుకాచౌదరి ని ఎమ్మెల్యే గా నామా నాగేశ్వరరావు ను ఎంపీగా పంపి ఖమ్మంలో తిరుగులేని శక్తి గా మారాలని అనుకున్న కాంగ్రెస్ నేతలకు ఈ ఇద్దరు నాయకులు దిమ్మదిరిగే షాక్ ఇవ్వడంతో అధికార టీఆర్ఎస్ నేతల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కొందరు కొత్త నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా పొట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. మరికొంత కాలం ఆగితేనే కాంగ్రెస్ పార్టీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పోట్ల ఇటీవలే టీఆర్ఎస్కు గుడ్బై చెప్పేసి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు అన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కి అనుకూలంగా మారడం గమనార్హం.