అధికార టీడీపీ నేతల్లో విచిత్రమైన టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడు ఎవరి ద్వారా చంద్రబాబు తన ఇంటికి భోజనానికి పిలుస్తారా? అని నేతలు ఒణికి పోతున్నారు. అదేంటి? భోజనానికి పిలిస్తే.. భయమెందుకు అనే.. సహజ సందేహం ఎవరికైనా కామన్. నిజమే.. భోజనానికి పిలిస్తే బాధెందుకు? భయం అంతకన్నా ఎందుకు? అంటే అక్కడే ఉంది అసలు కిటుకు. నొప్పింపక తానొవ్వక.. అన్నట్టుగా వ్యవహించడం టీడీపీ అదినేత చంద్రబాబు రాజకీయాల్లో మొదటి నుంచి అలవరుచుకున్నారు. నొప్పి తెలియకుండానే అవతలి వారికి షాక్ ఇవ్వడం ఆయనకు తెలిసినంతగా రాజకీయాల్లో మరెవరికీ కూడా తెలియదు. అలాగే.. సొంత పార్టీలోనూ ఇదే ఫార్ములాను అమలు చేస్తున్నారు. రాజకీయంగా అత్యంత కీలక సమయం ఇప్పుడు నడుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి చంద్రబాబు అన్ని మార్గాలను తనకు అనుకూలంగా మలుచు కుంటున్నారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచుతున్నారు. పింఛన్లు, రీయింబర్స్ మెంట్లు ఇస్తున్నారు. ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. అదేవిధంగా ఏపీని అభివృద్ధి చేస్తున్నారు. విదేశాలకు వెళ్లి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. తనకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరితోనూ ఏపీ అభివృద్ధిపైనే మాట్టాడుతున్నారు. మొత్తంగా టీడీపీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు చేయాల్సిన కష్టం మొత్తం చేస్తున్నారు. అంతాబాగానే ఉంది. అయితే, ఆయన టీం పరిస్థితి ఏంటి? ఆయన లాగా ఆయన టీం కూడా పనిచేయాలి కదా? ముఖ్యంగా బాధ్యుల పరిస్థితి ఏంటి? బాబు ఎంత చేసినా.. క్షేత్రస్థాయిలో కష్టపడాల్సిన వారు కష్టపడాలికదా?
ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సరాల తర్వాత ప్రజా ప్రతినిధుల పనితీరును సమీక్షిస్తున్నారు. తమ పార్టీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే కూడా చేయించి నివేదికలు తెప్పించుకున్నారు. పార్టీ, నిఘావర్గాలు, ఇతర సంస్థల నుంచి తెప్పించుకున్న నాలుగు రకాల సర్వేలను వడపోశారు. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల జాబితాను ప్రత్యేకంగా రూపొందించారు. నలభై మంది ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గాలలో వ్యతిరేకత ఎక్కువగా ఉందనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ సమన్వయ కమిటీ సమావేశాల్లోనూ, వర్క్షాపుల్లోనూ, ఇతర వేదికలపై కూడా పదేపదే చెబుతూ వచ్చారు. ఇప్పటికైనా మించిపోయింది లేదన్నారు. పనులు చేశామని చెప్పుకుంటే సరిపోదని, ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పుకొచ్చారు చంద్రబాబు. అయినా మారని వారిని టార్గెట్ చేయడం ప్రారంభించారు.
ఇప్పుడు బాబు అలంటి నేతలపైనే దృష్టి పెట్టారు. ఎన్నిపనులున్నా వారానికి రెండు రోజులు పార్టీలో సదరు నేతలు ఎలా కష్టపడుతున్నా రు? ప్రజల్లో ఎలా తిరుగుతున్నారు? వంటి అంశాలపై బాబు దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో ఆయన దృష్టికి వచ్చిన కొందరు పనిచేయని నేతలకు తనదైన శైలిలో ఫోన్లోనే క్లాస్ ఇస్తున్నారు. అప్పటికీ మారనివారిని ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తున్నారు. భోజనం అయ్యాక అసలు విషయం నింపాదిగా చెప్పుకొస్తున్నారు. ఇక, మిమ్మల్ని సదరు పదవి నుంచి తప్పిస్తున్నాం.. మీరు ఇక నుంచి ఆ పదవిని వదులు కోవాల్సిందే.. అని సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలైతే.. వచ్చే ఎన్నికల్లో సీటు రాదని కరాఖండీగా చెప్పేస్తున్నారు. దీంతో ఇప్పుడు నేతలకు బాబు భోజనానికి పిలుస్తున్నారంటేనే పెద్ద టెన్షన్ పట్టుకుంది. ఈ పరిణామం.. తో నేతలు బాబు కార్యాలయం ఫోన్ వస్తోందంటేనే బెంబేలెత్తి పోతున్నారని తెలుస్తోంది. మరి బాబా మజాకా?!!