పెద్దపెల్లి ఎంపీ బాల్క సుమన్ నెల రోజులుగా సైలెంట్ అయిపోయారు. రాష్ట్రంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా మీడియా ముందుకొచ్చి తెగ హడావుడి చేసే ఎంపీ ఈ మధ్య ముఖం చాటేసారు. గత నెలలో విద్యుత్ అంశం పై చర్చ కు రావాలని అధికార పార్టీ కి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై ఎంపీ బాల్క సుమన్ స్పందించారు. అధికార పార్టీ చర్చకు సిద్దమని , కాంగ్రెస్ నేతలు రావాలంటూ రేవంత్ రెడ్డి కి ప్రతి సవాల్ విసిరారు. దీని పై కాంగ్రెస్ నేతలు చర్చ కు సిద్దపడగా ఎంపీ బాల్క సుమన్ వెనకడుగు వేశారు.
ఈ అంశం పై ముఖ్యమంత్రి కేసీఆర్ , ఎంపీ బాల్క సుమన్ ను తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. అన్ని విషయాలలో తలదూర్చొదంటూ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇటీవల ఎంపీ బాల్క సుమన్ ప్రెస్ మీట్ కు సిద్దపడగా టీఆర్ ఎస్ కార్యాలయం నుంచి అందిన ఆదేశాల మేరకు ఆయన సమావేశం నిర్వహించకుండానే వెనుదిరిగినట్లు సమాచారం. మరోవైపు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కే ఈ సారి ఎంపీ టికెట్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నే బాల్క సుమన్ కు వ్యూహాత్మకంగానే చెక్ పెడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది.
గతంలో వివేక్ పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. అయితే గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో ఉన్న వివేక్ కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడంతో ఆ పార్టీలోకి జంప్ చేసేశారు. దీంతో కేసీఆర్ చివరి క్షణంలో పెద్దపల్లి బరిలో సుమన్ను పోటీ చేయించగా ఆయన విజయం సాధించారు. ఎన్నికల తర్వాత వివేక్ తిరిగి టీఆర్ఎస్లోకి రావడంతో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి టిక్కెట్ కేసీఆర్ ఆయనకే ఖరారు చేసేశారన్నది పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది.
పెద్దపల్లి టిక్కెట్ వివేక్కు ఇస్తే వచ్చే ఎన్నికల తర్వాత ఎంపీ బాల్క సుమన్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ సమావేశాల్లో నూ టీఆర్ఎస్ ఎంపీలందరూ మాట్లాడినా... బాల్క సుమన మాత్రం మాట్లాడకపోవడం గమనార్హం. ఇదంతా ఇప్పుడు అటు అధికార టీఆర్ఎస్ నేతల్లో ఇటు విపక్షాల్లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ వద్ద మెప్పు పొందేందుకు నిత్యం ఆరాటపడే బాల్క సుమన్ పరిస్థితి ఇప్పుడు ఆయన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయనకు కేసీఆర్ ఎమ్మెల్యే సీటు ఇవ్వవచ్చన్నది పార్టీ వర్గాల టాక్.