నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ , కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యోదంతంపై రెండు పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. శ్రీనివాస్ హత్యతో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం , సూర్యాపేట ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి కి ప్రమేయం ఉందని కాంగ్రెస్ నేత, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వేముల వీరేశం, జగదీశ్ రెడ్డిది పూర్తిగా నేర చరిత్ర అని, అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కంటున్నారు.
గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన పలు హత్య కేసుల్లో మంత్రి జగదీశ్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. శ్రీనివాస్ హత్యపై సీబీఐతో విచారణ జరిపిస్తే ఎమ్మెల్యే వీరేశం, మంత్రి జగదీశ్రెడ్డి అసలు రంగు బయట పడుతుందని ఆయన సవాల్ చేస్తున్నారు. కోమటిరెడ్డి ఆరోపణలపై మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ధీటుగా స్పందించారు. శ్రీనివాస్ హత్యతో ఎమ్మెల్యే వీరేశం, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొంటున్నారు. కావాలనే ఎమ్మెల్యే కోమటి రెడ్డి తమపై దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడుతున్నారు.
అసలు కోమటి రెడ్డి బ్రదర్స్ దే నేర చరిత్ర అని, శ్రీనివాస్ హత్య కేసులో వారి ప్రమేయం ఉండొచ్చని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి టీఆర్ఎస్ను బద్నాం చేస్తున్నాడని జగదీశ్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఇటు కోమటి రెడ్డి, అటు జగదీశ్ రెడ్డి మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో నల్గొండ జిల్లా రాజకీయాల్లో కాకపుడుతోంది. ఏదేమైనా వచ్చే ఎన్నికల పై ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపుతాయనీ, సీఎం కేసీఆర్ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే వీరేశం వ్యవహార శైలిపై సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఈసారి వీరిద్దరికీ టికెట్ ఇవ్వకపోవచ్చుననే ప్రచారం ఇటీవల జోరుగా సాగుతోంది.
కేసీఆర్కు సన్నిహితుడాగా ఉండే జగదీశ్రెడ్డికి తప్పనిసరి పరిస్థితుల్లో టిక్కెట్ ఇవ్వాల్సి వస్తే ఆయన్ను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నల్గొండ జిల్లా సెటిలర్లు ఎక్కువుగా ఉండే ఎల్బీనగర్ నుంచి పోటీ చేయించి, వేముల వీరేశంను ఇంటికి పంపించేస్తారన్నది నల్గొండ జిల్లాలో అధికార పార్టీ వర్గాల్లోనే బలంగా వినిపిస్తోంది.