ఓవైపు టీడీపీ బీజేపీపై మాటల తూటాలు పేల్చుతోంది. రాష్ట్రానికి బడ్జెట్ లో మొండిచేయి చూపడంపై ఆగ్రహించిన టీడీపీ.. ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమవుతోంది. మాటల తూటాలు పేల్చుకుంటున్న నేతలు.. త్వరలోనే తలాక్ చెప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ మరో ముందడుగు వేశారు. మార్చి ఐదో తేదీలోగా ప్రత్యేక హోదాపై ప్రకటన రాకుంటే ఆరో తేదీన ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు. దీంతో ఏపీ వర్సెక్ కేంద్రం హైడ్రామాలో మరో ట్విస్ట్ మొదలైంది.
ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై సమరశంఖం పూరించింది వైసీపీ. ఏప్రిల్ 5లోపు ప్రత్యేకహోదా ఇవ్వకుంటే వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారంటూ జగన్ సంచలన ప్రకటన చేసి.. పొలిటికల్ హీట్ రాజేశారు. నెల్లూరు జిల్లా కలిగిరి ప్రజాసంకల్పయాత్రలో జగన్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. హోదా కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని జగన్ చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయన కార్యాచరణ ప్రకటించారు. విభజన గాయాలు మానాలంటే ఆంధ్రప్రదేశ్ కు హోదా ఒక్కటే సంజీవని అని జగన్ స్పష్టం చేశారు.. ప్రత్యేక హోదా సాధనకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్టు వెల్లడించారు.
‘ప్రత్యేక హోదా మా హక్కు.. ప్కాకేజీ మాకొద్దు’ అనే నినాదంతో మార్చి 5న ఢిల్లీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలతో కలిసి ధర్నా చేపడతామని జగన్ చెప్పారు.. మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకూ జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ తమ పార్టీ ఎంపీలంతా నిరసనలు తెలియజేస్తారని చెప్పారు. అయినా కేంద్రం దిగిరాకుంటే.. ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి ఒత్తిడి పెంచుతామని సంచలన ప్రకటన చేశారు.
వైసీపీ ఎంపీల రాజీనామా అంశాన్ని జగన్ తెరపైకి తేవడంతో రాష్ట్ర రాజకీయం హాట్ హాట్ గా మారింది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరుపై జగన్ దూకుడు పెంచారు. అయితే.. ఎంపీల రాజీనామాలపై కొంత డైలమా కనిపిస్తోంది. ఎంపీలంతా రాజీనామా చేస్తారని జగన్ స్పష్టంగా వెల్లడించారు. అయితే జగన్ పత్రిక సాక్షిలో మాత్రం లోక్ సభ ఎంపీలు రాజీనామా చేస్తారని రాశారు. దీంతో.. ఎంపీలందరూ రాజీనామా చేస్తారా.. లేక లోక్ సభ ఎంపీలు మాత్రమే చేస్తారా... అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.