ఏపీ సీఎం నివాసానికి మంగళవారం ఓ అరుదైన అతిధి వచ్చారు. దేశంలోనే అతి సంపన్నుడైన ఆ అతిథి ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ఆయనే ముకేశ్ అంబానీ.. లక్షల కోట్ల ఆస్తులు ఆయన సొంతం.. అంతేకాదు.. అధికార పార్టీకి దగ్గరివారుగా పేరు కూడా ఉంది. మరి అలాంటి అతిథి వస్తే చంద్రబాబు ఏం మర్యాద చేశారో తెలుసుకోవాలని ఉందా..
అయితే చదవండి.. ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబు అంబానీల భేటి దాదాపు రెండు గంటలపైనే సాగింది. సీఎం ఇచ్చిన విందులో అంబానీ పూర్తిగా శాఖాహరమే భోంచేశారట. ఆయన కోసం చంద్రబాబు ఏపీలోని స్పెషల్స్ అన్నీ ప్రత్యేకంగా తెప్పించారట. ఆ జాబితాలో కాకినాడ కాజా, భీమవరం పూతరేకులు, ఒంగోలు మైసూర్ పాకులు ఉన్నాయట.
అరకు కాఫీ నుంచి బాబాయ్ హోటల్ ఇడ్లీ వరకూ అనేక ప్రత్యేక వంటకాలు వడ్డించారట. బాబాయ్ ఇడ్లీతో పాటు దోశ, ఊతప్పం వంటివి కూడా అంబానీ రుచి చూశారట. అంతే కాదు.. ముకేశ్ ఉలవచారు పట్ల ప్రత్యేక మక్కువ కనబరిచారట.ముకేశ్ తినడానికి వెనుకాడుతుంటే.. అబ్బే.. అన్నీ ఆర్గానిక్ వంటకాలే అంటూ సీఎం చంద్రబాబు కొసరి కొసరి వడ్డించారట.
ఎంతైనా అరుదైన అతిథి కదా.. అందుకే భోజనం తరవాత వీడ్కోలు చెప్పేటప్పడు తిరుమల శ్రీవారి చిత్రపటంతో పాటు తిరుపతి లడ్డును, ఉప్పాడ చీరను బహుమతిగా అందజేశారు. అంతేనా.. మంత్రి నారా లోకేశ్ స్వయంగా గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికి.. మళ్లీ తిరిగి వెళ్లేటప్పడు కూడా విమానాశ్రయానికి వెళ్లి మరీ సెండాఫ్ ఇచ్చారట. దటీజ్ ముకేశ్ అంబానీ.