2019 ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటం, ముందస్తు ఎన్నికలు జరపాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పదునెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలన్నీ వ్యూహలు రచిస్తున్నాయి. గత ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుండగా, సీఎం కేసీఆర్ కూడా కాంగ్రెస్ ను మరోసారి దెబ్బకొట్టేందుకు ప్లాన్ లు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వలసల పర్వం కూడా మెదలైంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతలు అడుగులు వేస్తున్నారు.
ప్రధాన పార్టీలన్నీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరరేపి ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తమ పార్టీలోకి లాక్కునేందుకు పావులు కదుపుతున్నాయి.. ప్రతిపక్షాలను నైతికంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ నేతలతో పాటు, తెలంగాణలో కనుమరుగైన తెలుగుదేశం పార్టీల్లో బలమైన నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కేసీఆర్ . మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ , టీడీపీ నేతలకు గాలం వేస్తోంది. . ఇప్పటికే తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు కొంతమంది నేతలు హస్తం గూటికి చేరారు. టీ కాంగ్రెస్ లో ఇప్పటికే హేమా హేమీలైన సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ లో నేతల మధ్య విబేధాలు తారాస్ధాయిలో ఉన్నాయి. ఒకరంటే ఒకరికి గిట్టదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటి రెడ్డి బ్రదర్స్ మధ్య పచ్చ గడ్డి వేయకపోయినా భగ్గుమనేంత గోడవలు నెలకొన్నాయి. ఇక జానారెడ్డి, ఉత్తమ్ కు మధ్య అంతగా సఖ్యత లేదు.ఒకవైపు కోమటి రెడ్డి బ్రదర్స్ పీసీపీ పదవి కోసం చేయని ప్రయత్నాలంటూ లేవు. మరోవైపు జానారెడ్డి వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థి తానే అని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్లి సాధించేది ఏమీ లేదనేది నా అభిప్రాయం. రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరడం అనేది సమర్ధించాల్సిన విషయం. ఎందుకంటే టీడీపీ-టీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో, రేవంత్ టీడీపీని వీడటంలో ఎంటువంటి తప్పులేదు.
ఓటుకు నోటు కేసులో ఇరికించి తనను జైల్లో పెట్టించిన కేసీఆర్ తో కలవడం అనేది అసాధ్యమైన పని . ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం. ఇక టీడీపీ-టీఆర్ఎస్ కలిస్తే కమ్మ సామాజిక వర్గం కూడా కేసీఆర్ వైపు మళ్లే ఛాన్స్ లు ఉన్నాయి. ఇక తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం కేసీఆర్ కు పుల్ యాంటీగా ఉంది. ఈ క్రమంలో ఒకవేళ రేవంత్ ను కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించినా. అధికారంలోకి వస్తుందా అంటే కష్టమేనని చెప్పుకొవచ్చు . ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్లి ఎప్పటిలాగేనే కేసీఆర్ ను విమర్శిస్తూ, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం మినహా సాధించేదేమీ ఏమీ లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
రేవంత్ వెళ్లిపోవడం వల్ల టీడీపీకి కొత్తగా వచ్చిన నష్టమేమి లేదు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ చచ్చిపోయే స్ధాయిలో ఉంది. టీడీపీ చచ్చిపోయిన పాము అని విమర్శించిన టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆ చచ్చిపోయిన పామును దగ్గరికి తీసుకుంటున్నారు. టీడీపీ సమాధి కాకుండా చూసుకునేందుకు టీఆర్ఎస్ తో పొత్తకు సై అంటున్నారు చంద్రబాబు. అందువల్ల రేవంత్ వెళ్లిపోవడం వల్ల టీడీపీకి వచ్చింది లేదు, పోయేది కూడా ఏమీ లేదు. మధ్యలో రేవంత్ రెడ్డికి దక్కేది ఏమీ లేదు. ఎప్పటిలాగే కేసీఆర్ ను విమర్శించడమే.