పోరాటం ఉధృతమవుతోంది. ఓ వైపు వైసీపీ ఇప్పటికే రాజీనామాల అస్త్రం సంధించి సవాల్ విసిరింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఏం చేయబోతోంది అనేది ఆసక్తిగా మారింది.
కేంద్రం తీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్న చంద్రబాబు గురువారం మరోసారి సమన్వయ కమిటీతో సమావేశమయ్యారు. కేంద్రంపై పోరాటానికి ఎంపీలు సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలోనే కీలక నిర్ణయాలుంటాయని సంకేతాలిచ్చారు. రాష్ర్ట ప్రయోజనాల కోసమే కేంద్రంతో కొనసాగుతున్నామని.. తెలుగుదేశం పార్టీకి పదవులు ముఖ్యం కాదన్నారు. 29సార్లు ఢిల్లీ వెళ్లినా బడ్జెట్లో మనకు మళ్లీ అన్యాయం చేశారని నిర్వేదంగా మాట్లాడిన చంద్రబాబు.. హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం కొనసాగించాల్సిందేనని తేల్చి చెప్పారు.
రాష్ర్టానికి జరిగిన అన్యాయంపై సమన్వయ కమిటీలో మరోసారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు కేటాయించినట్లే ఏపీకి ఇచ్చారు తప్ప... విభజన హామీలను నెరవేర్చే దిశగా కేంద్రం అదనంగా ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు. పార్లమెంట్ సమావేశంలో పార్టీ ఎంపీలు బాగా పనిచేసి సమస్యను జాతీయస్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. రానున్న రోజుల్లోనూ ఇదే పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కేంద్రంతో మిత్రపక్షంగా కొనసాగుతోంది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పదవుల కోసం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. పదవులకంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్న ఆయన.., వాజ్ పేయి హయాంలో తొమ్మిది కేంద్ర మంత్రి పదవులు ఇస్తామన్నా వెంటపడలేదని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు ప్యాకేజీ రూపంలో ఇస్తామంటేనే ఆనాడు ఒప్పుకున్నామని.. ఈ విషయంపై నేతలంతా స్పష్టతతో ఉండాలని దిశానిర్థేశం చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్సీతో తమకెలాంటి నష్టం ఉండదని సమన్వయ కమిటీలో చంద్రబాబు శ్రేణులకు సూచించినట్టు తెలుస్తోంది. అయితే పవన్ జెఎఫ్సీ సమావేశానికి కాంగ్రెస్ ను పిలవడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తంచేసింది. రాష్ర్టానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ ను ఎలా పిలుస్తారని ఫీలయినట్టు సమాచారం.
ఇక.. జగన్ తన ఎంపీలతో రాజీనామా చేయిస్తారనేది ఒట్టి డ్రామా అని కొట్టిపారేశారు టీడీపీ నేతలు. కేవలం కేసులు మాఫీ చేయించుకోవడానికి జగన్ నాటకం ఆడుతున్నారని చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మనకు కేంద్రంతో ఎలాంటి వ్యక్తిగత అవసరాలూ లేవని.. జగన్ లాగా మనం సాగిలపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు తేల్చిచెప్పినట్టు సమాచారం. లోక్ సభ సభ్యులతో రాజీనామా చేయించి రాజ్యసభలో విజయసాయి రెడ్డిని కొనసాగిస్తామని చెప్పారంటేనే జగన్ కు ఉన్న సిన్సియారిటీ అర్థం చేసుకోవచ్చన్నారు. కేసులు పెట్టి భయపెడతారని కొందరు అంటున్నారని, తప్పు చేయనప్పుడు మనకు అలాంటి భయాలు అక్కర్లేదని చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.