నీరవ్ మోదీ.. ఇప్పుడు ఈ పేరు ప్రపంచవ్యాప్తం. 11వేల కోట్ల రూపాయలకు పైగా సొమ్మును బ్యాంకు నుంచి తీసుకుని విదేశాలకు పారిపోయిన ఘనుడీయన. ఈయన సామ్రాజ్యం తవ్వేకొద్దీ బయటపడుతోంది. తాజాగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డితో కూడా నీరవ్ మోదీకి సంబంధం ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది.
నీరవ్ మోదీ వజ్రాల వ్యాపారి. ప్రపంచంలో పేరెన్నికగన్న వజ్రాలు, ముత్యాల బ్రాండ్ లన్నీ ఈయనవే. అతి తక్కువ కాలంలోనే ఫోర్బ్స్ జాబితాలో పేరు సంపాదించుకున్న ఘనత కూడా ఈయన సొంతం. హైఫై లైఫ్ అనుభవించే నీరవ్ మోదీ.. విలాసాలకు బాగానే ఖర్చు పెట్టేవాడని అర్థమవుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు 11వేల కోట్లకు పైగా ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ సంస్థలపై ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. ఈ కోణంలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీరవ్ మోదీ హైదరాబాద్ లో భారీగానే ఆస్తులు కూడబెట్టుకున్నట్టు తెలుస్తోంది. రాజీవ్ జెమ్స్ పార్క్ పేరుతో నాడు నీరవ్ మోదీ ఓ కంపెనీని హైదరాబాద్ లోని రావిర్యాల సెజ్ లో ప్రారంభించాడు. ఇందుకోసం ప్రభుత్వం 250 ఎకరాలను నీరవ్ మోదీకి నాటి వై.ఎస్. ప్రభుత్వం కేటాయించింది. 2500 మందికి ఉపాధి కల్పిస్తామని, ఇక్కడ వజ్రాలు, ముత్యాలను ప్రాసెసింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తామని నాడు ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంలో నీరవ్ మోదీ పేర్కొన్నారు. దీంతో.. ఈ కంపెనీ శంకుస్థాపనుకు నాటి ముఖ్యమంత్రి హోదాలో వై.ఎస్. స్వయంగా హాజరయ్యారు. వై.ఎస్. కోరిక మేరకే దీనికి రాజీవ్ పార్క్ అని పేరు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే ఆ తర్వాత రాజీవ్ పార్క్ పేరు మారింది. గీతాంజల్ జెమ్స్ పార్క్ గా నామకరణం చేశారు. దీని బుక్ వాల్యూని 3400 కోట్లుగా పేర్కొంటోంది ఈ సంస్థ. అయితే దీనికి విలువ కడితే రూ.300 కోట్లు కూడా ఉండదని తెలుస్తోంది. అంతేకాదు.. గతంలో 1800 మంది వరకూ పనిచేసిన ఈ సంస్థలో ఇప్పుడు 400 మంది కూడా లేరని సమాచారం. సెజ్ లో భారీగా ఆస్తులను పోగేసిన ఈ సంస్థ.. ఆ మేరకు పనితీరు కనబరచడంలేదని సోదాల్లో తేలింది. విదేశాల నుంచి తీసుకొచ్చిన ముడి వజ్రాలు, ముత్యాలను ఇక్కడ ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేస్తుంటారు.
నీరవ్ మోదీ అవినీతి సామ్రాజ్యం వెలుగులోకి రావడంతో దాని వెనుక పనిచేసిన చాలామంది పేర్లు ఇప్పుడు బయటికొస్తున్నాయి. కేవలం హైదరాబాద్ లోనే కాదు దేశవిదేశాల్లో కూడా నీరవ్ మోదీతో పలువురు రాజకీయ ప్రముఖులకు సంబంధాలున్నాయి. తాజాగా నీరవ్ మోదీ కంపెనీకి వై.ఎస్. స్థలం కేటాయించడం, స్వయంగా కంపెనీ శంకుస్థాపనకు హాజరుకావడం.. లాంటి పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.