జగన్ ఎప్పుడైతే ఎంపి ల రాజీనామాలను తెర మీదకు తీసుకోని వచ్చాడో అప్పటి నుంచి టీడిపి ఏం మాట్లాడుతుందో వారికే అర్ధం కావడం లేదు. అందరు గందరు గోళం గా మాట్లాడుతున్నారు. నిన్న ఆది నారాయణ రెడ్డి మాట్లాడిన మాటలే దానికి నిదర్శనం. ప్యాకేజీ పక్కన బెట్టి ఏపీ సీఎం చంద్రబాబు తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించడానికి ముందుకు రావాలని, మొత్తం 25 మంది ఎంపీలతో రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని ప్రతిపక్ష నేత జగన్ నెల్లూరులో జరిగిన సభలో చంద్రబాబుకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
ప్రత్యేక హోదాపై పోరాటంలో తమతో కలిసి ముందుకు రావాలని చంద్రబాబును జగన్ కోరారు. ఏప్రిల్ 6న తమ ఎంపీలందరూ రాజీనామా చేస్తారని, అదే రోజు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే… దెబ్బకు కేంద్రం దిగివస్తుందన్నారు.
జగన్ సవాల్ కు టీడీపీ నేతలు స్పందించారు. వైసీపీ ఎంపీల కంటే నెల ముందే తమ ఎంపీలు, మంత్రులు రాజీనామా చేస్తారని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎటువంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడానికి నెల రోజుల ముందే, మార్చి 5న తమ ఎంపీలంతా రాజీనామా చేస్తారని మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సమస్యకు పరిష్కారం లభించకపోతే.. కేంద్రంతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.