జేసీ దివాకర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా అనంతపురంలో చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుని అప్పటి ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. దీంతో ఆయన టీడీపీలోని నేతలతో సఖ్యత పెంచుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పలు సందర్భాల్లో బోధించారు కూడా. అయితే, జేసీ తన పరిస్థితిని, మూడ్ను మార్చుకోలేదు. గతంలో ఉన్న వగరును ఆయన ఎంత మాత్రమే తగ్గించుకోలేదు. నియోజక వర్గంలో తాను చెప్పిందే వేదంగా నడవాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇదే ఇప్పుడు పెను వివాదాలకు కారణం అవుతోంది. ముఖ్యంగా అదే టీడీపీలో సీనియర్లుగా ఉన్న వారి పట్ల కూడా జేసీ తన పంథాను మార్చుకోకుండా మాట్లాడుతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నారు.
ప్రస్తుతం జేసీకి సంబంధించిన ఓ వీడియో యూట్యూబ్లో హల్ చల్ చేస్తోంది. సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్న పల్లె రఘునాథ రెడ్డిని జేసీ ఏక వచనంతో సంబోధించారని, తన పంథా తనదేనని, తాను ఎవరిమాటా వినని అన్నట్టుగా ఈ వీడియో వెల్లడి కావడం సంచలనం రేపుతోంది. విషయంలోకి వెళ్తే.. ఎంపీ జేసీ దివాకర్రెడ్డి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలోని పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన వైసీపీ కార్యకర్తకు రూ. 10 లక్షల విలువైన సిమెంటు రోడ్డు కాంట్రాక్టు పనిని అప్పగించారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా బిత్తరపోయిన టీడీపీ నేతలు.. మనం నిత్యం తిట్టిపోసి, మనకు బద్ధ శత్రువుగా భావించే వైసీపీ నేతకు రోడ్డు కాంట్రాక్టు ఎలా అప్పగిస్తామని ప్రశ్నించారు.
అయితే, దీనిని లైట్గా తీసుకున్న జేసీ.. నా ఇష్టం అనేధోరణిలో ముందుకు పోయారు. సదరు పనిని వైసీపీ కార్యకర్తకే కేటాయించారు. ఈ పరిణామంతో విస్తుపోయిన టీడీపీ నేతలు.. పనైతే అప్పగించారు కానీ.. బిల్లు ఎలా మంజూరు చేయిస్తారో చూస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే సంబంధిత పంచాయతీరాజ్ అధికారి చీఫ్విప్ పల్లె రఘునాథరెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో ఆయన.. తాను ఊర్లో లేనని, పుట్టపర్తికి వచ్చిన తరువాత మాట్లాడతానని ఆ అధికారికి చెప్పారు. అదే సమయంలో ఈ నెల 11న ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఓ వివాహ కార్యక్రమం నిమిత్తం పుట్టపర్తికి వచ్చారు. ఆ సమయంలో పెడపల్లి సిమెంటు రోడ్డు బిల్లు మంజూరు విషయమై ఎదురైన సమస్యను సదరు వైసీపీ కార్యకర్త.. ఎంపీ జేసీ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఆయన వెంటనే పల్లె రఘునాథరెడ్డికి ఫోన్ చేశారు. తాను ఇచ్చిన పనికి సంబంధించిన బిల్లు కచ్చితంగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా.. తానెవరిమాటా వినననే విషయం తెలుసుకదా.. ? అంటూ తన గురించి చెప్పుకొనే ప్రయత్నం చేశారు. దీంతో మౌనం వహించిన పల్లె ఆ బిల్లు విషయం తాను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తానని సానుకూల సమాధానమిచ్చి ఫోన్ కట్ చేశారు. అయితే, జేసీ.. పల్లెతో మాట్లాడిన వివాదాస్పద వైఖరి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంక జేసీ మారడా? అనే ప్రశ్న కూడా వస్తోంది. మరి దీనికైనా జేసీ సమాధానం చెబుతాడో లేదో చూడాలి. మొత్తానికి జేసీ ఎక్కడున్నా.. వివాదాలు కామనే అనే వైఖరిని మాత్రం ఆయన మార్చుకోలేక పోతున్నారు. పైగా వైసీపీతో అంటకాగడం ఏంటో ఆయనకే తెలియాలి.