ఏ ఉద్యమ సంస్థకైనా మనుగడే ప్రధానం. అది లేనప్పుడు ఎంత పెద్ద సంస్థయినా మూటాముల్లె సర్దు కోవాల్సిందే.చరిత్ర చెబుతున్న పాఠం ఇదే. ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోందంటే.. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రారం భించిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ(జేఎఫ్సీ) వ్యవహారం మూణ్నాళ్ల ముచ్చటేనా అనే కామెంట్లు వినిపస్తున్నం దునే! ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న హామీలను తాము పూర్తిస్థాయిలో నెరవేరుస్తామని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏపీ ప్రజలకు హామీ ఇచ్చింది. అయితే, ఇప్పటి వరకు ఒక్క హామీనీ నెరవేర్చలేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయలేదు. దీంతో సర్వత్రా విస్మయం.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రభుత్వం రోడ్డెక్కింది.
ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదని ప్రకటించింది. లెక్కలు గణాంకాలు.. వెల్లడించింది. అయితే, ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర దళం కూడా వీధుల్లోకి వచ్చింది. కూడికలు, తీసివేతలు వల్లె వేసింది. ఈ పరిణామంతో రాష్ట్రం మొత్తం జనసేనాని వైపు చూసింది. పవన్ ఎలా రియాక్ట్ అవుతాడని చూసింది. దీంతో అందరూ ఆశించినట్టే మీడియా ముందుకు వచ్చిన పవన్.. జేఎఫ్సీని స్థాపిస్తున్నానని చెప్పాడు. అంతేకాదు. అప్పటి వరకు నాలుగు గోడలకే పరిమితమైన జేపీ, ఉండవల్లి అరుణ్, చలసాని శ్రీనివాస్ వంటి వారిని ఆహ్వానించారు. కమ్యూనిస్టులను కలుపుకొన్నారు. కాంగ్రెస్ను పిలిచారు. అందరూ కలసి ఏపీకి కేంద్రం ఎంతిచ్చింది? ఎంత మేరకు ఖర్చుచేశారు? వంటి విషయాలపై దృష్టి పెట్టారు. అయితే, దీనికి తొలి దశలో చంద్రబాబు ప్రభుత్వం స్పందించింది.
నివేదికను అందించింది. అంతా బాగానే ఉంది. అయితే, రెండు రోజుల ఈ జేఎఫ్సీలో నేతలు తలో మాటా మాట్లాడారు. చంద్రబాబుకు పక్కా అనుకూలుడైన జేపీ.. ఒక రకంగా మాట్లాడితే.. కమ్యూనిస్టులు మరోరకంగా మాట్లాడారు. కేంద్రంతో హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అయితే, ఇక్కడే తిరకాసు మొదలైంది. పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్సీలో ఎవరి రాజకీయ లెక్కలు వాళ్లకు ఉన్నాయి. వీరిలో లోక్ సత్తా జేపీ మినహాయిస్తే మిగతా వాళ్లంతా తెలుగుదేశం వ్యతిరేక రాజకీయంతో సాగుతున్న వాళ్లే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వీళ్లతో కలిసి ఉండగలడా? అనేది పెద్ద ప్రశ్న.
ఎందుకంటే.. బాబుతో పవన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవల కూడా బాబుతో, టీడీపీ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యాడు. జేఎఫ్సీలోని ఉండవల్లి, కాంగ్రెస్ వాళ్లు, కమ్యూనిస్టులు.. వీళ్లంతా చంద్రబాబుకు వ్యతిరేకులే. మరి అలాంటి సమయంలో బాబుకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు మాత్రమే మెజార్టీ నేతలు పవన్ వెంట నడుస్తారు. మరి పవన్ దానికి సిద్ధంగా లేడు కదా? మరి అలాంటి సమయంలో జేఎఫ్సీని విస్తరించడం, ఇంకా దీనిని కొనసాగిస్తానని చెప్పడం అంటే.. వృథా ప్రయాసే అంటున్నారు పరిశీలకులు. మరి పవన్ ఏ విధంగా ముందుకు వెళ్తాడో చూడాలి.